తెలుగుతేజం పీవీ సింధుకు అభినందనలు తెలిపిన జనసేనాని

టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో కాంస్యం నెగ్గిన పీవీ సింధుపై అభినందనల జడివాన కురుస్తోంది. ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించిన నేపథ్యంలో జనసేనాని పవన్ కల్యాణ్ అభినందనలు తెలియజేశారు.

సింధు గెలుపు నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన విడుదల చేశారు. టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో కాంస్యం గెలుచుకోవడం ద్వారా దేశానికి మరో పతకం అందించిందని సింధును కొనియాడారు. అప్పుడు రియోలోనూ, ఇప్పుడు టోక్యోలోనూ భారతదేశ పతాకాన్ని రెపరెపలాడించిందని తెలిపారు. ఒలింపిక్స్ వేదికపై సింధు పోరాట పటిమకు క్రీడాభిమానులు మురిసిపోతున్నారని వెల్లడించారు. నిన్నటి మ్యాచ్ లో విజయం కోసం సింధు పోరాడిన తీరు, బ్యాడ్మింటన్ లో ఆమె ఎదిగిన విధానం యువతకు స్ఫూర్తిదాయకం అని పవన్ అభిప్రాయపడ్డారు.

క్రీడారంగంలో సింధు విజయాలు సాధించేలా తీర్చిదిద్దారంటూ ఆమె తల్లిదండ్రులు విజయ, పీవీ రమణలకు, కోచ్ లకు అభినందనలు తెలిపారు. సింధు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.