శ్రీదేవి వర్ధంతి.. శ్రీదేవి చేతితో రాసిన లెటర్ షేర్ చేసిన జాన్వీ కపూర్
అతిలోక సుందరి శ్రీదేవి అందరికీ దూరమై అప్పుడే మూడేళ్లు గడిచింది. 2018లో దుబాయ్లో ఓ బాత్టబ్లో పడి శ్రీదేవి హఠాన్మరణానికి గురి అవ్వగా.. ఆ వార్తను అభిమానులు తట్టుకోలేక పోయారు. ఇదిలా ఉంటే ఇవాళ శ్రీదేవి మూడవ వర్ధంతి నేపథ్యంలో పలువురు ఆమెను గుర్తు చేసుకుంటున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నామంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. కాగా శ్రీదేవి వర్దంతి నేపథ్యంలో ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్.. తన సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ని పెట్టారు. తన గురించి శ్రీదేవి చేతితో రాసిన ఓ లెటర్ని జాన్వీ అభిమానులతో షేర్ చేసుకున్నారు. దానికి మిస్ యు అని కామెంట్ పెట్టారు. ఇక ఆ లెటర్లో శ్రీదేవి, జాన్వీ గురించి.. ఐ లవ్యూ మై లబ్బూ. నువ్వు ఈ ప్రపంచంలోనే గొప్ప బేబివి అని రాశారు.
కాగా ఓ ఫంక్షన్ కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి కార్డియాక్ అరెస్ట్తో కన్నుమూశారు. ఆ సమయంలో జాన్వీ కపూర్ తన మొదటి చిత్రం దఢక్ షూటింగ్ కోసం భారత్లో ఉండిపోయింది. తన కుమార్తెను హీరోయిన్గా తెరపైన చూసేందుకు ఇంకొన్ని రోజులు మాత్రమే ఉండగా.. అదే సమయంలో శ్రీదేవి మరణించడంతో జాన్వీ వ్యక్తిగతంగా ఆవేదనకు గురైంది. ఆ బాధలోనే తన మొదటి చిత్రం షూటింగ్ని పూర్తి చేసింది జాన్వీ.
ఇక ఇప్పుడు జాన్వీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. హిందీలో ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. ఇక తెలుగులోనూ జాన్వీ కపూర్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న లైగర్ కోసం మొదట జాన్వీని అనుకున్నారు. కానీ వేరే సినిమాలకు డేట్లు క్లాష్ అవుతుండటంతో ఈ ప్రాజెక్ట్కు జాన్వీ ఓకే చెప్పలేదు. మరి త్వరలోనైనా జాన్వీ తెలుగులోకి ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.