దూసుకొస్తున్న ‘జావద్’ తుపాను.. ఏపీ తీరంపైనే గురి!

బంగాళాఖాతంలో కొత్త తుపాను పురుడు పోసుకుంటోంది. అండమాన్ వద్ద సముద్రంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అది బంగాళాఖాతంలోకి ప్రవేశించి వాయుగుండంగా, ఆపై తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తుపానుగా మారితే దీనిని ‘జవాద్’ అని పిలవనున్నారు.

ఇది ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఏపీ తీరాన్ని తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం గణనీయంగా ఏపీ, ఒడిశాలపై ఉండొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. కాగా, ‘జవాద్’ అనే పేరును సౌదీ అరేబియా సూచించింది. అరబిక్ భాషలో ‘జవాద్’ అంటే గొప్పది అని అర్థం.