కవిత్వమే ఆయుధంగా కులవివక్షపై పోరాడిన యోధుడు గుఱ్ఱం జాషువా: ఆళ్ళ హరి

సమాజంలో తనకెదురైన కులవివక్షపై, మూఢాచారాలపై కవిత్వమే ఆయుధంగా పోరాడిన గొప్ప యోధుడు విశ్వకవి గుఱ్ఱం జాషువా అని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు.

ఆధునిక కవులలో అగ్రస్థానం పొందిన గుఱ్ఱం జాషువా వర్ధంతి సందర్భంగా నగరంపాలెంలోని ఆయన విగ్రహానికి జనసైనికులు ఆదివారం పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ బాల్యం నుంచి అగ్ర కుల అహంకారాలను, సంఘ సంఘర్షణలను ఎదుర్కొన్న జాషువా, గుండెల్ని తాకే తన భావకవితలతో ప్రజల్లో చైతన్యం నింపి, ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందారన్నారు.
మరోవైపు గబ్బిలం, ఫిరదౌసి, బాపూజీ, కొత్తలోకం, ముంతాజ్ మహల్ వంటి 36 మహోన్నతమైన గ్రంధాలతో పాటు లెక్కలేనన్ని కవితా ఖండికలు రచించిన గుర్రం జాషువా తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం పొందారన్నారు. జనసేన రాష్ట్ర దళిత నాయకులు కొర్రపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ గుఱ్ఱం జాషువా అందించిన స్పూర్తితో సమాజంలో ఎలాంటి అసమానతలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని అన్నారు. కార్యక్రమంలో మైనారిటీ నాయకులు షర్ఫుద్దీన్, శేషు, దాసరి రాము, వడ్డె సుబ్బారావు, గోపి, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.