కార్తీక మాసం ప్రత్యేకత.. కార్తీకంలో వచ్చే ముఖ్యమైన పండుగలు

నేటి నుంచి కార్తీక మాసం  ప్రారంభం.. సాధారణంగా అన్ని మాసాల్లోకి కార్తీక మాసం చాలా ప్రత్యేకమైనదిగా నిలుస్తోంది.సనాతన ధర్మంలో ఆయనములు రెండు ఉన్నాయి. అవి ఉత్తరాయణం.. దక్షిణాయణం. ఉత్తరాయణంలో మాఘ మాసానికి ఎంతటి ప్రాధాన్యం ఉందో.. దక్షిణాయణంలో కార్తీక మాసానికి అంతటి విశిష్టత ఉంది. ముఖ్యంగా హిందువులకు ఇది చాలా పవిత్రమైన నెల. ఈ పుణ్య మాసం హరిహరులు ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో చేసే శివారాధనకు విశేష పుణ్యఫలం లభిస్తుందని కార్తీక పురాణం చెబుతోంది. కార్తీక మాసంలో స్నానం, దానం, దీపారాధన, జపం, అభిషేకం చేయాలి. ప్రత్యేకించి సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు, ఆ తర్వాత చేసే దానాలు, ఉపవాసాలకు గొప్ప శక్తి ఉందని స్కంద పురాణ అంతర్గతంగా ఉన్న కార్తీక పురాణం వివరిస్తోంది. దీపారాధన చేస్తే పాపాలు తొలగి పుణ్యఫలం లభిస్తుంది. ఈ మాసంలో నక్తం లేదా ఉపవాసం ఆచరించగలిగితే ఆరోగ్యం, దైవచింతన పరంగా శుభాలు కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా శివాలయాలు అన్నీ కిటకిటలాడుతాయి. మాలధారణ చేసే వారు సైతం ఈ నెలను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు..

కార్తీక సోమవారం
హిందూ మతంలో కార్తీక మాసం ప్రత్యేకమైనది. సాక్షాత్తు భగవంతుడు శివునికి పరమపవిత్రమైన మాసం ఇది. ఈ నెలలో సోమవారంనాడు ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దానధర్మలు చేసినవారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని అంటారు. కార్తీక మాసం సోమవారం నాడు ప్రారంభం అయితే అది ఒక విశేషం. సోమవారం పూట కార్తీక మాస ప్రారంభం శుభఫలితాలకు సంకేతమని పురోహితులు చెబుతున్నారు. అందుచేత కార్తీక సోమవారం శివాలయాలను దర్శించడం చాలా మంచిది. ఈ వారంలో ముత్తైదువులు భక్తిశ్రద్ధలతో శివునిని కొలిస్తే మాంగళ్య భాగ్యం చేకూరుతుందని విశ్వాసం. ఇంకా చెప్పాలంటే ఈ సోమవారాల్లో శైవభక్తులు నిష్టనియమాలతో శివునిని ఆరాధిస్తారు.

కార్తీకంలో వచ్చే ముఖ్యమైన పండుగలివే..
కార్తీక శుక్ల పాడ్యమి లేదా బలి పాడ్యమి: అంటే బలి చక్రవర్తిని స్మరించడం వల్ల కీర్తి, యశస్సు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే కార్తీక శుద్ధ విదదియ లేదా భగినీహస్త భోజనం.. దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈరోజు ప్రజలు ‘భ్రాతృద్వితీయ’ పేరుతో భగినీ హస్తభోజనం (సోదరీమణుల ఇళ్లకు వెళ్ళి మృష్టాన్న భోజనం చేసి, వారికి కానుకలను సమర్పించడం) చేస్తారు. సోదరీమణుల ఇళ్లకు వెళ్లి వారి చేతి వంటను తిని తమ స్తోమతకు తగినట్టుగా వస్త్రాలు, తాంబూలం సమర్పించి వాళ్లను ఆనందింపజేస్తారు. ఆమె చేతి భోజనాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఆడపిల్లలకు సౌభాగ్యం, పురుషులకు ఆయురారోగ్య ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెబుతారు.

కార్తీక శుక్ల ఏకాదశి
కార్తీక శుక్ల ఏకాదశి చాలా పవిత్రమైనది. ఆ రోజున శివారాధన చేయడం, మహా విష్ణువును పూజించడం, విశేషించి సత్యనారాయణ వ్రతం ఆచరించడం ఫలప్రదం అవుతుంది అంటారు. ఈ ఏకాదశిని ప్రభోదని ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశితోనే చాతుర్మాస్య వ్రతములు పూర్తవుతాయి. అలాగే కార్తీక మాసంలో ఎక్కుమంది సత్యనారాయణ వ్రతం చేయాలని సంకల్పిస్తారు. జీవితంలో ఎప్పుడైనా ఆచరించవచ్చు. కానీ.. వ్రత కథ ప్రకారం కొన్ని ముఖ్యమైన విశేష దినములు, స్వామికి ప్రీతికరమైన దినములుగా పేర్కొంటారు.

క్షీరాబ్ది ద్వాదశి
కార్తీక మాసంలో అత్యంత ముఖ్యమైనది క్షీరాబ్ది ద్వాదశి. మన సనాతన ధర్మంలో పంచభూతాలను దైవంగా భావిస్తారు. అందులో అగ్నిని ఆరాధించడం, ప్రతిరోజూ దీపమును వెలిగించడం ప్రాధాన్యతగా చెప్పబడింది. ప్రతి మనిషి తన జీవితంలో రోజూ ఆలయంలో, ఇంటి వద్ద దీపం వెలిగించి దీపారాధన చేయవలెను. కలియుగంలో ఇలా నిత్యం చేయలేని స్థితి ఏర్పడినప్పుడు కార్తీక శుక్ల ద్వాదశి రోజు (క్షీరాబ్ది ద్వాదశి) దీపారాధన చేస్తే వారికి ఏడాదంతా దీపారాధన చేసినంత పుణ్యఫలం లభిస్తుందని కార్తీక పురాణం పేర్కొంది.

కార్తీక శుద్ధ ద్వాదశి
కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసికోట వద్ద ఉసిరి కొమ్మ ఉంచాలి. తులసికోటను లక్ష్మీ స్వరూపంగా, ఉసిరిని మహా విష్ణువుగా భావించి క్షీరాబ్ది ద్వాదశి వ్రతం ఆచరించవలెను. పూర్వం దేవతలు పాలకడలిని చిలికిన రోజు అయినందున ఈరోజును చిలుకు ద్వాదశి అని కూడా పిలుస్తారు.

కార్తీక పౌర్ణమి
కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో ఈశ్వరుడిని అభిషేకం చేసుకొని శివారాధన చేసి జ్వాలా తోరణంను దర్శించవలెను. ఈ పుణ్య మాసంలో కార్తీక సోమవారాలు అత్యంత పవిత్రమైనవిగా శివపురాణం చెబుతోంది. సోమవారాల రోజు శివారాధన చేయడం, ఈశ్వరుడిని పంచామృతాలతో అభిషేకించడం, ఉపవాసం వంటివి ఆచరించడం, నదీస్నానం ఆచరించి దీపారాధన చేయడం వల్ల హరిహరుల అనుగ్రహం కలుగుతుందని కార్తీక పురాణం స్పష్టంగా చెబుతోంది. ఈ మాసంలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఆయుస్సు, ఆరోగ్యం కలిగి కష్టాలు తొలగుతాయి. ఆవు నెయ్యితో దీపారాధన చేయడం లక్ష్మీప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి.