అమిత్ షాతో కేసీఆర్ భేటీ.. ఏం చర్చించారు?

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అంతకు ముందు కేంద్ర మంత్రి గోయల్తోనూ సమావేశమయ్యారు. వాస్తవానికి ఆదివారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్షా నేతృత్వం లో జరిగిన మావోయిస్టుల ప్రభావిత ప్రాంత రాష్ట్రాల సదస్సులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. మూడు నాలుగు దశాబ్దాలుగా.. రాష్ట్రం వామపక్ష తీవ్రవాదాన్ని చవిచూసిందని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేదరిక నిర్మూలన బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఏకకాలంలో చేపడుతున్నామని తెలిపారు. యువతతో పాటు అన్ని వర్గాలకూ… రాష్ట్రప్రభుత్వం చేదోడుగా ఉంటోందని వెల్లడించారు. వ్యవసాయ సాగునీటి సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు.

అయితే.. ఈ సమావేశం అనంతరం.. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో కేసీఆర్ సమావేశమయ్యారు. సుమారు గంటన్నర పాటు సాగిన ఆ సమావేశంలో రాష్ట్రంలో భారీగా పేరుకున్న ఉప్పుడు బియ్యాన్ని.. కేంద్ర ప్రభుత్వమే కొనుగోలుచేసే వెసులుబాటు కల్పించాలని ప్రధానంగా విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. గత పర్యటనలోనూ ముఖ్యమంత్రి పీయూష్ గోయల్ను కలిసి.. ఇదే విషయాన్ని విజ్ఞప్తిచేశారు. కేంద్రం కొనుగోలు చేయకపోతే.. రాష్ట్రం ఇబ్బంది పడాల్సి వస్తుందని అందువల్ల కేంద్రం సాయం చేయాలని ముఖ్యమంత్రి మరోసారి కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఇంటికి వెళ్లి ఆయనతో సుమారు గంటన్నర సేపు భేటీ అయ్యారు.

ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏం చర్చించారు? అనేది ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో త్వరలోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉండడం.. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని.. స్వయంగా అమిత్ షా తన నిర్మల్ పర్యటనలో పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సో.. దీనిపై అయితే.. వారు చర్చించే అవకాశం లేదు. ఇక కాంగ్రెస్ తెలంగాణ చీఫ్.. రేవంత్ రెడ్డి పై ఉన్న కేసు వ్యవహారంపై మాట్లాడి ఉంటారని.. తలనొప్పులు తగ్గించుకునేందుకు కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చి ఉంటారని ప్రచారం అయితే.. జరుగుతోంది. అయితే.. ఇది చిన్న విషయమని.. రాష్ట్రానికి అదనపు బలగాల కేటాయింపుపై మరోసారి చర్చించి ఉంటారని అంటున్నారు పరిశీలకులు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులపై షాతో కేసీఆర్ చర్చించి ఉంటారని.. భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ భేటీపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. మరి కేసీఆర్.. షా భేటీలో ఎలాంటి విషయాలు చర్చకు వచ్చాయనేది తెలియాల్సి ఉంది.