ఐదు రోజుల ముందే రెడీ అయిన ఖైరతాబాద్ వినాయకుడు.. చూసేందుకు పోటెత్తుతున్నభక్తులు

హైదరాబాదులోని ఖైరతాబాద్‌ గణేశుడు సిద్ధమయ్యాడు. వినాయక చవితికి ఐదు రోజుల ముందే పూర్తయిన పంచముఖ రుద్రగణపతిని చూసేందుకు భక్తులు అప్పుడే క్యూకడుతున్నారు. గతేడాది కరోనా కారణంగా 11 అడుగుల విగ్రహానికే పరిమితమైన నిర్వాహకులు ఈసారి 40 అడుగుల ఎత్తు, 27 అడుగుల వెడల్పు, 28 టన్నుల బరువున్న వినాయకుడిని తీర్చిదిద్దారు.

ఖైరతాబాద్‌లో వినాయకుడిని ఏర్పాటు చేయడం ప్రారంభించి 65 ఏళ్లు నిండిన సందర్భంగా రెండేళ్ల క్రితం 65 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 10 గణేశ్ నవరాత్రులు ప్రారంభం కానుండగా, 19న నిమజ్జనం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

కాగా, వినాయక చవితి నేపథ్యంలో హుస్సేన్ సాగర్‌లో నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించి నిన్న పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, ఇతర అధికారులు ట్యాంక్‌బండ్‌ను పరిశీలించారు. రెండు క్రేన్లతో పాత విగ్రహాలను నిమజ్జనం చేసి చూశారు. ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా, నిమజ్జన సమయం ఆదా అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు అంజనీకుమార్ తెలిపారు.