ఏలూరు ఘటనపై కిషన్‌రెడ్డి ఆరా.. సాయం చేసేందుకు కేంద్రం సిద్ధం

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పెద్ద సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురైన ఘటనపై కేంద్ర హోంశాఖ స్పందించింది. ఘటనకు సంబంధించిన వివరాలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరాతీశారు. ఈమేరకు ఆదివారం ఆయన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన.. ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఏపీ గవర్నర్‌ కార్యాలయంతో కేంద్రహోంశాఖ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. గవర్నర్‌ నుంచి ఘటనకు సంబంధించి పూర్తి నివేదిక వచ్చాక కేంద్రం స్పందించే అవకాశం ఉంది.