కేటీఆర్ పరువునష్టం దావాపై సిటీ సివిల్ కోర్టులో విచారణ

తనపై డ్రగ్స్ ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ పరువునష్టం దావా వేయడం తెలిసిందే. ఈ దావాపై సిటి సివిల్ కోర్టు నేడు విచారణ చేపట్టింది. కేటీఆర్ తరఫు న్యాయవాదుల వాదనలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. కేటీఆర్ పరువుకు భంగం కలిగేలా రేవంత్ రెడ్డి ఆరోపణలు ఉన్నాయని కోర్టుకు వివరించారు.

కేటీఆర్ కు డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం లేకపోయినా, ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని వాదనలు వినిపించారు. కేటీఆర్ కు రేవంత్ రెడ్డి రూ.1 కోటి పరువునష్టం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కేటీఆర్ తరఫున న్యాయవాదులు కోర్టును కోరారు. ఇలాంటి అసంబద్ధ ఆరోపణలు మరోసారి చేయకుండా శాశ్వత పరిష్కారం చూపాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనిపై కాసేపట్లో తీర్పు వెలువడే అవకాశాలున్నాయి.