కూచిపూడి నాట్య కళాకారిణి శోభా నాయుడు కన్నుమూత

ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ శోభానాయుడు శోభా నాయుడు(58) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. నెల రోజుల క్రితం ఇంట్లో జారిపడటంతో ఆమె తలకు గాయమైంది. అప్పటినుంచి ఆర్థో న్యూరాలజీ సమస్యలతో బాధపడుతున్నారు. ఇదే క్రమంలో ఆమెకు కరోనా సోకడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా అక్కడి వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందారు.

1962లో విశాఖ జిల్లా అనకాపల్లెలో జన్మించిన శోభానాయుడు… చిన్న వయసులోనే నృత్యరూపకాల ద్వారా ప్రసిద్ధి చెందారు. విఖ్యాత కూచిపూడి గురువు వెంపటి చినసత్యం శిష్యురాలిగా…. ఆయన బృందంలో సభ్యురాలిగా దేశవిదేశాల్లో ప్రదర్శనలతో గుర్తింపు పొందారు. నృత్యరూపకాల్లో సత్యభామ, పద్మావతి పాత్రలతో ప్రసిద్ధి చెందారు. కూచిపూడి నృత్యకారిణిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శోభానాయుడు…. 2001లో పద్మశ్రీ అవార్టు అందుకున్నారు. సంగీత నాటక అకాడమీ, నృత్య కళాశిరోమణి, నృత్య చూడామణి, ఏపీ ప్రభుత్వం అందించే హంసా అవార్డులు శోభానాయుడును వరించాయి. దేశ విదేశాల్లో సుమారు 15 వందల మందికి కూచిపూడి నృత్యంలో శిక్షణ అందించారు.

పద్మశ్రీ శోభానాయుడు ఆకస్మిక మరణం పట్ల తెలుగు అసొసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) సంతాపం తెలిపింది. శోభానాయుడు ఆకస్మిక మరణం కళా రంగానికే తీరని లోటు అని పేర్కొంది. శోభానాయుడు మృతికి అధికార భాషా సంఘం అధ్యక్షులు డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఏపీ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, సిలికానాంధ్ర అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్, ప్రముఖ నాట్య కళాకారుడు కె.వి.వి.సత్యనారాయణ తదితరులు సంతాపం ప్రకటించారు.