పెంబర్తిలో కాకతీయుల కాలం నాటి లంకె బిందె లభ్యం

భూమి తవ్వకాల్లో నిధులతో కూడిన లంకె బిందెలు దొరకడం గతంలోనూ అనేక పర్యాయాలు జరిగింది. తాజాగా జనగామ మండలం పెంబర్తి గ్రామంలో నర్సింహా అనే వ్యక్తి నెలరోజుల క్రితం 11 ఎకరాల వెంచర్‌ను కొనుగోలు చేశారు. అనంతరం వెంచర్‌ను చదును చేస్తుండగా.. పొలంలో లంకె బిందె లభ్యం కాగా, ఈ వార్త కొద్దిసేపట్లోనే దావానలంలా వ్యాపించింది. భూమిలో వెంచర్ ఏర్పాటు చేసేందుకు జేసీబీతో మట్టిని చదును చేస్తుండగా, ఓ చోట లంకె బిందె కనిపించింది. ఆ బిందెలో 17 తులాల బంగారంతో పాటు 10 కేజీల వెండి కూడా లభ్యమైంది. లంకె బిందె వ్యవహారం జిల్లా మొత్తం పాకిపోవడంతో అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు, తహసీల్దార్ రవీందర్, సర్పంచ్ ఆంజనేయులు, పోలీసు సిబ్బంది ఆ వెంచర్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా ఆ బిందెలోని ఆభరణాలు కాకతీయుల కాలం నాటివని భావిస్తున్నారు.