ప్రముఖ నటుడు వేణుగోపాల్‌ మృతి

కరోనా మహమ్మారి మరో నటుడిని బలి తీసుకుంది. ప్రముఖ సినీ, టీవీ నటుడు కోసూరి వేణుగోపాల్‌ కరోనా మహమ్మారి బారిన పడి చికిత్స పొందుతూ కన్ను మూశారు. గత 22 రోజులుగా ఆయన గచ్చిబౌలిలోని ప్రముఖ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. గత నెలలో ఆయనకు కరోనా సోకింది. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో బుధవారం కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వేణుగోపాల్‌ ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో నటించేవారు. మర్యాద రామన్న, విక్రమార్కుడు, ఛలో, పిల్ల జమిందార్‌ తదితర సినిమాలతో పాటు పలు సీరియళ్లలోనూ కనిపించారు. అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. వేణుగోపాల్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టాలీవుడ్ మంచి నటుడిని కోల్పోయిందంటూ అనేక మంది తమ సంతాపం ప్రకటించారు. ఆఖరుగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన అమీతుమీ సినిమాలో కనిపించారు.