కులాల మధ్య చిచ్చుపెట్టే కుతంత్రాలను నిలువరించాలి

కులాల మధ్య అంతరాలు తగ్గించి… అందరి మధ్య సఖ్యత పెంచేందుకు జనసేన పార్టీ తపిస్తోందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకు భిన్నంగా అధికార పక్షం కుయుక్తులు పన్నుతోంది. ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి సమాచారం అందుతోంది. ఈ కుతంత్రాలు తిరుపతి నగరంలో మొదలయ్యాయి. బలిజలు, యాదవుల మధ్య సఖ్యతను విచ్ఛిన్నం చేసేలా కొందరు అధికార పార్టీ వ్యక్తులు చేస్తున్న రెచ్చగొట్టే చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఈ ఉచ్చులో ఎవరూ పడకుండా… ఆ విధమైన కుతంత్రాలకు పాల్పడుతున్నవారిని ఆదిలోనే నిలువరించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. కులాల మధ్య చిచ్చులు రేపి తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగానే బలిజలకీ, యాదవులకీ మధ్య దూరం పెరిగేలా కుట్రలకు తెర తీశారు. ఆ కులాల్లోనూ వర్గాలు ఏర్పాటు చేసి ఐకమత్యాన్ని దెబ్బ తీసి తాము ఆధిపత్యం చలాయించాలని చూస్తున్నారు. ఈ రోజు తిరుపతి కావచ్చు… రేపు మరొక ప్రాంతం కావచ్చు. ప్రజల మధ్య సఖ్యత లేకుండా.. భేదభావాలతో ఉండేలా చేయడమే కుట్రదారుల పన్నాగం. ఈ తరుణంలో అన్ని కులాలవారూ… ముఖ్యంగా యువతరం అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటివారికి ప్రజాస్వామ్య పంథాలోనే సమాధానం ఇవ్వాలి. అందరూ ఒక తాటిపైకి వచ్చి ప్రజల మధ్య దూరం పెంచే కుట్రదారుల చర్యలను నిరసించాలని పవన్ కళ్యాణ్ కోరారు.