• పిఠాపురం సభపైనే యావత్ దేశం చూపు
• నోరుందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు
• అలా మాట్లాడినందుకే ఒక వ్యక్తి జైల్లో కూర్చొని లబోదిబోమంటున్నాడు
• జనసేన ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీల సమావేశంలో పార్టీ పీఏసీ ఛైర్మన్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
పిఠాపురం వేదికగా ఈ నెల 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేసే బాధ్యత ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జన సైనికుడు, వీరమహిళ తీసుకోవాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం స్ర్టైక్ రేట్ తో దిగ్విజయం సాధించిన అనంతరం జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో యావత్ దేశం చూపు పిఠాపురం సభపై ఉన్నదని, సభను జయప్రదం చేసేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. హోలీ పండగ నాడు నిర్వహిస్తోన్న ఈ సభను పండగ వాతావరణంలో జరుపుకొందామని చెప్పారు. సభ జరిగిన తీరు చూసిన ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు జనసేనే అన్నట్లు మనందరం కలిసి పని చేద్దామని అన్నారు. సభ నిర్వహణ కోసం వేసిన 14 కమిటీలు… సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా పని చేయాలని, ప్రతి కమిటీ మరో కమిటీతో సమన్వయం చేసుకుంటూ సభను జయప్రదం చేయాలని సూచించారు. ఆవిర్భావ సభ నిర్వహణ కోసం నియమించిన కమిటీలతో శనివారం కాకినాడలో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నుంచి ఎన్నికైన ఎంపీలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జ్ లు, పీఓసీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2014లో జనసేన పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించినప్పుడు నుంచి ఎన్నో కష్టనష్టాలు, అటుపోటులను తట్టుకొని పార్టీని తన సొంత రెక్కల కష్టంతో ముందుకు నడిపారు. ఇన్నేళ్ల పార్టీ ప్రస్థానంలో ఏనాడూ కూడా రాజకీయ లబ్ధి కోసం ఆయన పని చేయలేదు. మానవత్వం, నిజాయతీతో కూడిన విలువైన ప్రయాణం మాత్రమే చేశారు. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాని విధంగా వంద శాతం స్టైక్ రేట్ తో ఈ రోజు మనం విజయం సాధించాం. పోటీ చేసిన 21 శాసనసభ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్నాం. ఈ విజయం వెనుక శ్రీ పవన్ కళ్యాణ్ గారి కష్టం, త్యాగం ఎంతో ఉంది. గత వైసీపీ పాలనలో ఆయన్ను ఎంతలా టార్గెట్ చేశారో మనకు తెలుసు. వ్యక్తిగతంగా దూషించారు. ఈ రోజు మనమే అధికారంలో ఉన్నా దూషణపర్వం మాత్రం ఆగడం లేదు. పదవి ఉందనే అహంకారంతో ఆనాడు కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి నడిరోడ్డు మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మనందరికి తెలుసు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన పాపానికి జన సైనికులు, వీరమహిళలపై దాడి చేయించి, అక్రమ కేసులు బనాయించాడు. ఇప్పటికీ జన సైనికులు, వీర మహిళలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అమరావతి రైతుల సమస్యలు చెప్పడానికి ఢిల్లీ వెళ్లిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలియగానే కాకినాడకు బయలుదేరారు. మీరు వస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని అప్పటి డీజీపీ ఆంక్షలు విధిస్తే… అరెస్టు చేసుకుంటే చేసుకోండి అని మొండి పట్టుదలతో కాకినాడ వచ్చి బాధితులను పరామర్శించారు. పార్టీ నాయకులు, జనసైనికుల కోసం ఆయన ఎలా నిలబడతారో తెలిపే ఒక ఉదాహరణ ఇది. ఆయన ఏనాడు తన స్వార్థం కోసం ఆలోచించలేదు. రాష్ట్ర భవిష్యత్తు కోసం మాత్రమే ఆలోచిస్తారు. ఈ రోజు ఇంతమంది శాసనసభ్యులుగా, ఎంపీలుగా, మండలి సభ్యులుగా, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లుగా ఉన్నామంటే దానికి నూటికి నూరు శాతం శ్రీ పవన్ కళ్యాణ్ గారే కారణం. ఆయన ఇచ్చిన గుర్తింపే ఇదంతా.
• ఐదేళ్లపాటు దుర్మార్గంగా పాలించారు
వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. బటన్లు నొక్కుతున్నాం.. నొక్కుతున్నామని చెప్పి రాష్ట్ర భవిష్యత్తును తొక్కేశారు. పాలనపై ఏదైనా ప్రశ్నిస్తే చాలు కేసులు పెట్టి భయపెట్టారు. అలాంటి పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీ ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా మత్స్యకారుల సమస్యలపై మత్స్యకార అభ్యున్నతి యాత్ర చేపట్టాం. కాకినాడ నుంచి నరసాపురం వరకు పాదయాత్ర చేశాం. మత్స్యకారుల కడుపుకొట్టే 217 జీవో ను శ్రీ పవన్ కళ్యాణ్ గారు చించేశారు. రోడ్ల దుస్థితిపై గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టాం. గుంతల రోడ్లను ప్రజల ముందుపెట్టాం. వైసీపీ పాలనలో రోడ్లు ఎంతలా నాశమయ్యాయి అంటే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి కేవలం గుంతలు పూడ్చడానికే రూ.1600 కోట్లు ఖర్చు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలబడ్డాం. అన్నపూర్ణలాంటి గోదావరి జిల్లాలోనే 42 మంది కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. జలజీవన్ మిషన్ పథకం కింద కేంద్రం రూ.14,500 కోట్లు రాష్ట్రానికి కేటాయిస్తే… వీళ్లు కేవలం రూ.2250 కోట్లు మాత్రమే ఉపయోగించుకున్నారు. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రధాని నరేంద్ర మోదీ గారిని అభ్యర్థించి మరో నాలుగేళ్లు గడుపు పొడిగించేలా చేశారు. ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూనే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మన రాష్ట్రంలో రైతే రాజు అంటారు. అలాంటి రైతులను కూడా మోసం చేశారు. వారికి రావాల్సిన రూ.1600 కోట్ల ధాన్యం బకాయిలను పెండింగ్ పెట్టి వెళ్లిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నెల రోజుల్లో బకాయిలు చెల్లించింది. ధాన్యం కొన్న 24 గంటల్లోనే అన్నదాత ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది.
• రాష్ట్ర రాజకీయాల్లో అదే టర్నింగ్ పాయింట్
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈగోలు పక్కన పెట్టి మనందరం కలిసి పనిచేయాలి. చిన్న చిన్న అభిప్రాయభేదాలు ఉంటే మనం మాట్లాడుకుంటే సమసిపోతాయి. కూటమిలో ఉన్న మూడు పార్టీలు సమానమే. ఒకరు ఎక్కువ… ఇంకొకరు తక్కువ కాదు. అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే ఇంతటి ఘన విజయం సాధ్యమైంది. మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండాలని అసెంబ్లీ సాక్షిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆయన తన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. రాజకీయంగా మనందరికీ ఆకాంక్షలు ఉంటాయి. చిన్న చిన్న పదవులు ఆశిస్తాం. అధ్యక్షులు దృష్టిలో అన్ని ఉన్నాయి. ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. పొత్తు నిలబెట్టడానికి ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. బీజేపీ కోసం తన సీట్లను త్యాగం చేశారు. శ్రీ చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ పరామర్శించడానికి వస్తుంటే ఆయన విమానం టేకాఫ్ కాకుండా చేశారు. రోడ్డు మార్గంలో వస్తే బోర్డర్ లో పోలీసులు అడ్డుకున్నారు. జోరు వానలో జన సైనికులు, వీర మహిళలు ఆయనకు ఎంత అండగా నిలబడ్డారో ఆనాడు మనం చూశాం. రాష్ట్ర రాజకీయాల్లో అదే టర్నింగ్ పాయింట్. అది ఎవరూ మరిచిపోకూడదు. చంద్రబాబు గారిని పరామర్శించిన అనంతరం పొత్తుపై ప్రకటన చేశారు. బీజేపీని ఒప్పించి కూటమి కట్టడానికి కారకుడయ్యారు. ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మనందరం ఆయన వెనుక నడవాలి.
• హీరోలు కాదు జీరోలు అవుతారు
శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడం అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడారో మనం చూశాం. నోరుందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. ఇలా మాట్లాడినందుకే ఒక వ్యక్తి జైల్లో కూర్చొని లబోదిబోమంటున్నాడు. ప్రభుత్వం మారినా నోటికొచ్చినట్లు మాట్లాడే వారిని వదిలిపెట్టాం. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసే వారిపై బురద జల్లాలని చూస్తే మీరు హీరోలు అవ్వరు… జీరోలు అవుతారు. పార్టీ, నాయకుడిని కించపరిచేలా ఎవరు మాట్లాడినా జనసైనికులు, వీర మహిళలు కచ్చితంగా ఖండించాలి. అయితే దానికి సరైన పద్ధతి ఎన్నుకోవాలి.
• ఈ నెల 8 నుంచి కాకినాడలో కంట్రోల్ రూమ్
ఆవిర్భావ సభ కోసం పని చేయాలనుకునే ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తాం. సభ నిర్వహణకు 14 కమిటీలు వరకు నియమించాం. ఇందులో 254 మంది వరకు సభ్యులున్నారు. కమిటీల్లో పేరు లేకపోయినంత మాత్రాన మీరు పని చేయొద్దని కాదు. ప్రతి ఒక్కరు పనిచేస్తేనే సభ విజయవంతం అవుతుంది. ఆవిర్భావ సభకు సమయం చాలా తక్కువగా ఉంది. పనులు ఇవాళ సాయంత్రం భూమి పూజ నిర్వహించి మొదలుపెడతాం. ఈ నెల 8వ తేదీన కాకినాడలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తాం. ప్రతి కమిటీతో మాట్లాడి మార్గదర్శకాలు ఇస్తాం. కమిటీలో ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేసి సభను జయప్రదం చేయాలి. కమిటీల వారీగా వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని సమాచారం పంచుకోవాలి. పిఠాపురం వేదికగా నిర్వహిస్తున్న ఈ సభలో కమిటీ సభ్యులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు 160 మంది సిద్ధంగా ఉన్నారు. అవసరమైన వారు వీళ్లను వారి కమిటీల్లో సభ్యులుగా చేర్చుకోవచ్చ’ని అన్నారు.
• ఇది కీలక సభ… విజయవంతం చేద్దాం : పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ “సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం నిర్వహిస్తున్న సభ కావడంతో ఇది మనందరికీ కీలక సభ. ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేసి దీనిని విజయవంతం చేద్దాం. ముందు ప్లీనరీగా చేద్దామని అనుకున్నాం. అయితే అసెంబ్లీ సమావేశాలు పక్కన పెట్టాల్సి వస్తుందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోలేదు. పార్టీని బలోపేతం చేసే విధంగా సభ నిర్వహణ ఉంటుంది. పార్టీ భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేస్తారన్నారు. కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కాకినాడ నగర అధ్యక్షుడు, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఛైర్మన్ తోట సుధీర్, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, శాసన సభలో ప్రభుత్వ విప్ లు బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి శ్రీనివాస్, అరవ శ్రీధర్, జనసేన ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మెన్లు, పార్టీ నేతలు, మహిళ నేతలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment