ఏపీలో వినాయక ఉత్సవాలకు లైన్ క్లియర్

ఏపీలో గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఏపీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే వినాయక చవితి ఉత్సవాల విషయంలో ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ ప్రతిపక్షాలు, హిందూ సంఘాలు నిరసనలు దీక్షలు చేపట్టారు. కాగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. వినాయక చవితి ఉత్సవాల పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ప్రైవేటు స్థలాల్లో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది.

కరోనా నిబంధనలను పాటిస్తూ ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు చేసుకోవాలని సూచించింది. ఇక, మతపరమైన కార్యక్రమాలు నిరోధించే హక్కు ఎవరికీ లేదని తెలిపింది. ఇదే సమయంలో.. పబ్లిక్ ప్లేస్‌ల లో విగ్రహాల ఏర్పాటు, ఉత్సవాల నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా సమర్థించిన కోర్టు.. ప్రైవేటు స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని సర్కార్‌కు సూచించింది.