చట్టానికి ఎవరూ అతీతులు కారు.. హీరో ధనుష్‌పై మద్రాస్‌ హైకోర్టు ఆగ్రహం!

చెన్నై: కోలీవుడ్‌ స్టార్‌హీరో ధనుష్‌పై మద్రాస్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2015లో ధనుష్‌ అత్యంత ఖరీదైన రోల్స్‌ రాయిస్‌ కారు కొనుగోలు చేశారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నందుకుగాను చెల్లించాల్సిన పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అదే సంవత్సరంలో ధనుష్‌ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. ధనుష్‌ వేసిన పిటిషన్‌ను తాజాగా పరిశీలించిన హైకోర్టు.. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాన్య ప్రజలే పన్ను కడుతున్నప్పుడు విఐపిలకు ఇబ్బంది ఏంటంటూ ప్రశ్నించింది. చట్టం ముందు అందరూ సమానులేనని, పన్ను కట్టి తీరాల్సిందేనని తీర్పునిచ్చింది. లగ్జరీ కారు కొనుగోలు చేసి పన్ను మినహాయింపు ఎలా అడుగుతున్నారని నిలదీసింది. ఇప్పటికే తాను 50 శాతం పన్ను చెల్లించానని, మిగిలిన మొత్తాన్ని ఆగస్టు 9న చెల్లిస్తానని ధనుష్‌ సమాధానమిచ్చారు.