నమ్రతతో మహేష్ ఫోటో షూట్… వైరల్

మహేశ్ బాబు – నమ్రత ఇద్దరూ కూడా అన్యోన్య దాంపత్యానికి ఆనవాలుగా కనిపిస్తారు. తమ ఫ్యామిలీ .. తమ సరదాలు .. సందళ్లు తప్ప అనవసరమైన విషయాలను గురించి ఇద్దరూ పట్టించుకోరు. ‘వంశీ’ సినిమా సమయంలో ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత నమ్రత ఇక సినిమాల వైపుకు రాలేదు. మహేశ్ సినిమాలు .. యాడ్స్ .. అందుకు సంబంధించిన ప్లానింగ్ లో ఆమె ముఖ్యమైన పాత్రను పోషిస్తుంటారు. అలాగే ఆయన చేసే సామాజిక కార్యక్రమాలు అన్నీ కూడా నమ్రత చేతుల మీదుగానే జరుగుతూ ఉంటాయి.

నమ్రత బాగా తెలివైనవారనీ .. మహేశ్ సినిమా వ్యవహారాలను ఆమెనే చక్కబెడతారనే విషయం అందరికీ తెలిసిందే. ముందుగా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్న తరువాత సాధ్యమైనంత వరకూ అది మారకూడదనే మహేశ్ అభిప్రాయానికి తగినట్టుగానే ఆమె ప్లాన్ చేస్తూ ఉంటారు. మహేశ్ తన సినిమాల ఓపెనింగ్ కి రారు .. ఆయనకి అదో సెంటిమెంట్. అందువలన నమ్రత మాత్రమే హాజరవుతూ ఉంటారు. ఇక ఆ తరువాత ఆయన సినిమాలు ఎలాంటి రికార్డులను సృష్టించినా వాటిని గురించి ఆమె ఎక్కడా ప్రస్తావించరు .. ఎలాంటి పోస్టులు పెట్టరు.

ఒక వైపున మహేశ్ సినిమాలు .. యాడ్స్ .. సామాజిక సేవకి సంబంధించిన విషయాలతో పాటు మరో వైపున పిల్లలకి సంబంధించిన పూర్తి పనులను ఆమెనే చక్కబెడుతూ ఉంటారు. మహేశ్ బాబుకు మొదటి నుంచి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా అలవాటు తక్కువ. అందువలన ఆ లోటును నమ్రత భర్తీ చేస్తుంటారు. తమ ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలను .. వీడియోలను ఆమె పోస్ట్ చేస్తుంటారు. అలా మహేశ్ బాబును అభిమానులకు ఎప్పటికప్పుడు టచ్ లో ఉంచుతుంటారు. సితార ఆటపాటలు కూడా పోస్ట్ చేస్తూ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు.

మహేశ్ బాబు షూటింగు లొకేషన్స్ కి ఆమె వెళ్లడం చాలా తక్కువ. అలాంటి ఆమె తాజాగా మహేశ్ బాబుతో కలిసి ఒక ఫొటో షూట్ లో పాల్గొనడం విశేషం. ఒక మ్యాగజైన్ ఫొటో షూట్ కోసం చాలా కాలం తరువాత ఇద్దరూ కలిసి కెమెరా ముందుకు వచ్చారు. ఇద్దరూ కూడా చాలా స్టైలీష్ గా కనిపిస్తూ అదరగొట్టేశారు. ఇప్పుడు ఈ మేగజైన్ పోస్టర్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది. దీన్ని ఒక మ్యాగజైన్ కోసం దిగిన ఫొటోగా మాత్రమే చూడలేము. మహేశ్ దంపతులకు .. ఆయన అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక అందమైన జ్ఞాపకమని చెప్పచ్చు.