గానగంధర్వుని ఆరోగ్యం పై ఎంజీఎం ఆసుపత్రి బులెటిన్‌

గానగంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఆయన చికిత్స పొందుతున్న ఎంజీఎం హెల్త్‍‌కేర్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయనకు ఎక్మో సపోర్టుతో ప్రత్యేక ఐసీయు వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఓ హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. తమ వైద్య బృందం ఈ విషయంలో అంతర్జాతీయ వైద్య నిపుణులతో నిత్యం సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు.

అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఎంతోమంది కరోనా రోగులకు ఎక్మో సపోర్టుతో చికిత్స అందించిన వైద్య నిపుణులతో తమ డాక్టర్లు మాట్లాడుతున్నారని ఎంజీఎం ఆసుపత్రి బులెటిన్‌లో పేర్కొంది. ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు తాము అందిస్తున్న చికిత్స విధానంతో అంతర్జాతీయ వైద్య నిపుణులు కూడా ఏకీభవిస్తున్నారని వెల్లడించింది.