మండు వేసవిలో అర్ధరాత్రి కరెంటు కోతలు కరెక్ట్ కాదు

  • కరెంటు తీస్తే కార్యాలయంలో మంచాలేసుకొని పడుకుంటాం
  • కరెంటు కోతలు లేకుండా చూడండి
  • బిల్లుల వసూళ్లలో ఉండే బాధ్యత కరెంట్ సరఫరాలో కూడా ఉండాలి
  • బెలగాం, టౌన్ అనే వ్యత్యాసం చూపొద్దు
  • విద్యుత్ శాఖ అధికారులతో జనసేన నాయకులు

పార్వతీపురం: మండువేసవిలో, ఉక్కబోత సమయంలో అర్ధరాత్రి కరెంటు కోత విధిస్తే కార్యాలయానికి మంచాలతో వచ్చి పడుకుంటామని జనసేన పార్టీ నాయకులు హెచ్చరించారు. బుధవారం జనసేన పార్టీ జిల్లా నాయకులు చందక అనిల్ కుమార్, వంగల దాలినాయుడు, రాజాన రాంబాబు, నెయ్యిగాపుల సురేష్ కుమార్, అన్నా బత్తుల దుర్గాప్రసాద్, సీతానగరం మండల అధ్యక్షులు పాటి శ్రీనివాసరావు, మండల ప్రసాద్, వెలిగొందల సాయి తదితరులు పార్వతీపురం పట్టణ విద్యుత్ శాఖ ఏఈ రామారావుతో విద్యుత్ కోతలు, ప్రజల ఇబ్బందులపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓపక్క మండువేసవి, ఎండలు మండుతూ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న తరుణంలో ఉక్కబోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి ఆవుతున్న తరుణంలో అర్ధరాత్రి కరెంటు కోతలు విధించడం కరెక్ట్ కాదన్నారు. మంగళవారం రాత్రి విధించిన అప్రకటిత కరెంటు కోతకు జిల్లా ప్రజలు నరకం చూసారన్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రం పార్వతీపురం పట్టణంలో వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీల అవస్థలు వర్ణనాతీతమన్నారు. వేసవి సందర్భంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకొని కరెంటు కోతలు లేకుండా చూడాలన్నారు. మంగళవారం రాత్రి లాగే మళ్లీ కరెంటు కోతలు పునరావృతం అయితే కార్యాలయానికి మంచాలు తెచ్చి పడుకుంటామని హెచ్చరించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లాలి అన్నారు. కరెంట్ బిల్లులు పెంచడం, వసూలు చేయడంలో ఉండే బాధ్యత కరెంట్ సరఫరాలో కూడా ఉండాలన్నారు. అలాగే పార్వతీపురం టౌన్, బెలగాం అనే వ్యత్యాసం చూపకుండా రెండు ప్రాంతాలకు కరెంట్ సరఫరా సమానంగా చూడాలన్నారు. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. ప్రతి ఏటా వేసవిలో వస్తున్న సమస్యలను, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యలు చేపట్టాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. కరెంటు కోతలు ముఖ్యంగా అప్రకటిది కరెంట్ కోతలు లేకుండా చూడాలని వారు కోరారు. ఈ సందర్భంగా పట్టణ ఏ.ఈ కి వినతిపత్రాన్ని అందజేస్తారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసైనికులు పాల్గొన్నారు.