కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై మంత్రి ఆళ్ల నాని సమీక్ష

కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంపై కాకినాడ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు మంత్రి ఆళ్ల నాని.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పనిచేస్తున్న కోవిడ్ ఆస్పత్రులు 420, ఐసియు బెడ్స్ 5,601, ఆక్సిజన్ బెడ్స్ 18,992గా ఉన్నాయని.. రాష్ట్రవ్యాప్తంగా 3120 వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.. కరోనా సెకండ్ వేవ్ ని సాధ్యమైనంత మేరకు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందన్న మంత్రి.. 104 కాల్ సెంటర్ అత్యంత కీలకమైన వ్యవస్థగా సీఎం జగన్ భావిస్తున్నారని.. కాకినాడలోని 104 కాల్ సెంటర్లో మూడు షిఫ్టుల విధానంలో 50 మంది సిబ్బంది నియమించాలని అధికారులను ఆదేశించారు.

ఇక, కరోనా నిర్ధారణ కోసం చేస్తున్న పరీక్షల ఫలితాలు 24 గంటల లోపు రావడానికి చర్యలు తీసుకోవాలని సూచించి మంత్రి ఆళ్ల నాని.. అన్ని కోవిడ్ ఆస్పత్రిల్లో బెడ్లు పెంచడానికి పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించాలన్నారు.. కోవిడ్ ఆస్పత్రుల్లో పేషంట్ల దగ్గరికి మెడికల్ ఆఫీసర్ వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలని కోరారు.. మరోవైపు ఒడిశా రాష్ట్రం అంగూర్ నుంచి 120 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టినట్టు వెల్లడించార మంత్రి ఆళ్ల నాని.