పట్టాలెక్కిన ఎంఎంటీఎస్‌ రైళ్లు.. పాత సీజనల్‌ టికెట్లు చెల్లుబాటు..!

ఎంతగానో ఎదురు చూసిన హైదరాబాద్‌ ప్రజలకు తీపి కబురు అందించింది రైల్వేశాఖ. కరోనా మహమ్మారి కారణంగా గత 15 నెలలుగా నిలిచిపోయిన ఎంఎంటీఎస్‌ రైళ్లను పునరుద్ధరించింది రైల్వే శాఖ. ఇప్పుడు కరోనా కేసులు తగ్గడంతో రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ఎత్తివేయడంతో ఈ రోజు నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే గత ఏడాది మార్చి 23 కంటే ముందుగా జారీ చేసిన సీజనల్‌ పాత టికెట్లు తిరిగి చెల్లుబాటులోకి తీసుకువస్తున్నట్లు మంగళవారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

అయితే మార్చి 23,2020 నాటికి సీజనల్‌ టికెట్లు తీసుకున్నవారు ఆ రోజు నాటికి ఎన్ని రోజులు నష్టపోయారో, తిరిగి అన్ని రోజులు కలిసి వచ్చే విధంగా పాత సీజనల్‌ టికెట్‌ పాసులు చెల్లుబాటు అవుతాయన్నారు. వాటిని ఎంఎంటీఎస్‌ టికెట్‌ కేంద్రాల వద్ద సంప్రదించి రెన్యూవల్‌ చేసుకోవాలని కోరారు. గత సంవత్సరం సీజనల్‌ టికెట్‌ పొంది నష్టపోయిన రోజులు తిరిగి సీజనల్‌ టికెట్లు పొందవచ్చన్నారు.

కరోనా కారణంగా వీలైనంత వరకు ఎంఎంటీఎస్‌ రైలులో ప్రయాణం చేసేవారు క్యాష్‌లెస్‌ టికెట్‌ పొందే విధంగా ఎస్‌సీఆర్‌ అధికారులు ఏర్పాటు చేశారు. అందులో ఎంఎంటీఎస్‌ టికెట్‌ కేంద్రాల వల్ల ఏర్పాటు ఏసిన అటోమెటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మిషన్‌ వినియోగించుకున్న వారికి 3 శాతంన అన్‌ రిజర్వ్‌డ్‌ సిస్టం (యూటీఎస్‌) మొబైల్‌ యాప్‌లో ఆర్‌-వాలెట్‌ను టికెట్‌ కోసం వినియోగించుకున్న వారికి 5శాతం చొప్పున బోనస్‌ ప్రకటిస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా సెంట్రల్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ మాట్లాడుతూ.. ఎంఎంటీఎస్‌ రైలు వినియోగదారులు సీజనల్‌ టికెట్ల పొడిగింపు సదుపాయంతో పాటు నగదు రహిత టికెటింగ్‌ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. సాధారణ బుకింగ్ కౌంటర్లలో రద్దీని నివారించడానికి, టికెట్లను కొనుగోలు చేసేటప్పుడు శారీరక సంబంధాన్ని తగ్గించడానికి ఎంఎంటీఎస్ టిక్కెట్ల కొనుగోలు కోసం డిజిటల్ మోడ్‌ను ఉపయోగించుకోవాలని ఆయన ప్రయాణికులకు సూచించారు.

సర్వీసులు సమయాలు

* ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి: ఉదయం 7.50, 10.55, సాయంత్రం 4.20 గంటలకు

* లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా: ఉ.9.20, మ.12.40, సా.6.05

* హైదరాబాద్‌ నుంచి లింగంపల్లి: ఉ.9.36, సా.6.15

* లింగంపల్లి నుంచి హైదరాబాద్‌: ఉ.8.43, సా.5.15