మార్చి14 తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు?

న్యాయ నిపుణులతో ఎస్‌ఈసీ సమాలోచనలు

అమరావతి: పురపాలక ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ).. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై దృష్టిసారించింది. ఆ ఎన్నికలను కూడా నిలిపిన చోట నుంచి కొనసాగించాలా? కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వాలా?అనే విషయంపై న్యాయ నిపుణులతో సమాలోచనలు జరుపుతోంది. గతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో ఎక్కువ చోట్ల అధికార వైకాపా అక్రమంగా ఏకగ్రీవం చేసిందని విపక్షాలు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ చర్చలు జరుపుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా వచ్చిందా? వస్తే అక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అనే అంశంపై ఆరా తీస్తున్నారు.

ఇదే అంశంపై జిల్లా కలెక్టర్ల నుంచి నివేదిక కోరిన ఎస్‌ఈసీ.. సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌తోనూ చర్చించారు. సీఎస్‌తో అరగంట పాటు జరిగిన సమావేశంలో బుధవారం జరిగే మూడో దశ పంచాయతీ ఎన్నికల నిర్వహణతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీఎస్‌ ఎన్నికలపై ప్రభుత్వ ఆలోచనను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. మార్చి 10న పురపాలక ఎన్నికలకు పోలింగ్‌ జరగనుండగా.. మార్చి 14న లెక్కింపుతో ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ యోచిస్తున్నట్లు తెలిసింది. దీనికోసం కొద్దిరోజుల ముందే సిద్ధం కావాల్సి ఉన్నందున న్యాయ నిపుణులతో చర్చించి అతిత్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు  ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి.