‘నర్తనశాల’ ఫస్ట్ లుక్ రిలీజ్

తండ్రి ఎన్టీఆర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బాలకృష్ణ తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేశారు. ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో మాస్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. ఎన్టీఆర్ నటించిన నర్తనశాల చిత్రాన్ని ఎంతగానో ఇష్టపడే బాలకృష్ణ ఆయన స్వీయ దర్శకత్వంలో, కీలక పాత్రలో కొన్నేళ్ళ క్రితం నర్తనశాల అనే చిత్రాన్ని ప్రారంభించారు. షూటింగ్ మొదలైన కొద్ది రోజులకే ఇది ఆగిపోయింది.

మహాభారతంలోని నర్తన శాల ఇతివృత్తంగా ఈ సినిమాని తెరకెక్కించాలని బాలయ్య భావించగా, ఇందులో అర్జునుడిగా బాలయ్య, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు లతో 2004లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. బాలయ్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకున్న ‘నర్తనశాల’ ను తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి భారీ తారాగణంతో రూపొందిస్తున్నారని తెలియయడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుపుకున్న తర్వాత హీరోయిన్ సౌందర్య ప్రమాదవశాత్తు మరణించడంతో బాలకృష్ణ కలల ప్రాజెక్ట్ ‘నర్తనశాల’ అర్థాంతరంగా ఆగిపోయింది. ఆ తర్వాత బాలయ్య ఈ సినిమా పూర్తి చేసే ఆలోచన చేయలేదు.

అయితే ఈ మూవీని ఎప్పటికైన పూర్తి చేయాలని బాలయ్య ఆకాంక్ష. అందరి కోరికపై ఈ నర్తనశాల చిత్రానికి సంబంధించి 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ఈ విజయదశమి కానుకగా( అక్టోబర్ 24న) ఎన్ బి కె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా విడుదల చేయడం జరుగుతుంది అని బాలకృష్ణ స్పష్టం చేశారు. తాజాగా నర్తనశాల నుండి బాలకృష్ణకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో బాలయ్య లుక్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.