నిత్య చైతన్యమూర్తి బాబాసాహెబ్: శ్రీ పవన్ కళ్యాణ్

కారణజన్ముడు బాబాసాహెబ్ శ్రీ బి.ఆర్.అంబేద్కర్ అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో శ్లాఘించారు. భారత రాజ్యాంగ శిల్పిగా పూజలు అందుకుంటున్న మహనీయులు. నేడు ఆ మహానుభావుడు పరమపదం చెందిన పుణ్యతిధి. ఈ సందర్భంగా ఆ దీనజనోద్ధారునికి భక్తిపూర్వకంగా అంజలి ఘటిస్తున్నాను. నేను ఆరాధించే గొప్ప సంఘసంస్కర్త శ్రీ అంబేద్కర్. ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు సర్వదా అనుసరణీయం. ఆయనపట్ల నాకున్న భక్తి భావనే లండన్ లో ఆయన నివసించిన గృహాన్ని, లక్నోలో ఆయన స్మారక మందిరాన్ని సందర్శించేలా చేసింది. దేశంలో నిరంతరాయంగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి రాజ్యాంగ రూపకర్తగా శ్రీ అంబేద్కర్ ని ఆద్యులుగా చెప్పుకోవడం మనకు గర్వకారణం. రాజ్యాంగంలో నాడు ఆయన కల్పించిన పౌరహక్కులు, ఆదేశిక సూత్రాలు నేటికీ, ఏనాటికీ ప్రజలకు రక్షణగానే నిలుస్తుంటాయి. నేటి తరం రాజకీయ నాయకుల వికృత వైపరీత్యాలను ముందే పసిగట్టి ప్రజలకు ఇటువంటి రక్షా బంధనం రూపొందించారేమోనని ప్రస్తుత పరిస్థితులలో అనిపించకమానదు. భారతదేశంలో పుట్టిన ఒక గొప్ప మేధావిగా, మానవతా విలువలు మూర్తీభవించిన మహా మనిషిగా ప్రపంచం కొనియాడిన శ్రీ అంబేద్కర్ చూపిన మార్గంలోనే జనసేన ప్రస్థానం కొనసాగుతుందని ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తూ… ఆ తేజోమూర్తికి ప్రణామాలు అర్పిస్తున్నానని శ్రీ పవన్ కళ్యాణ్ తెలిపారు.