నామినేషన్ దాఖలు చేసిన నోముల భగత్‌

నిడమనూరు: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కుమార్ ఇవాళ తన నామినేషన్‌ను నిడమనూరు ఆర్వో కార్యాలయంలో దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మహముద్ అలీ, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌, ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, భాస్కర్ రావు, ఎమ్మెల్సీ తేరా చిన్నప రెడ్డితో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో భగత్ నామినేషన్ దాఖలు కార్యక్రమం సాదాసీదాగానే సాగిపోయింది.

సాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు నేటి మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. ఈనెల 31న నామినేషన్ల పరిశీలన.. చేపట్టనున్నారు అధికారులు. ఏప్రిల్‌ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఏప్రిల్‌ 17న ఎన్నికల పోలింగ్, మే 2న ఫలితం వెల్లడికానుంది.