ఒలింపిక్స్ లో భారత్ బోణి.. రజతం గెలిచిన మీరాభాయి
టోక్యో ఒలింపిక్స్లో భారత్కు తొలి పతకం దక్కింది. మహిళల 49 కేజీల విభాగంలో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రజతం గెల్చుకుంది. ఒలింపిక్స్లో రజత పతాకం సాధించిన తొలి వెయిట్ లిఫ్టర్గా మీరాబాయి ఘనత సాధించింది. స్నాచ్లో 87 కిలోలు ఎత్తిన ఆమె.. క్లీన్ అండ్ జర్క్లో 115 కిలోలు ఎత్తింది. మొత్తంగా 202 కిలోలు ఎత్తి భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది. చైనాకు చెందిన హూ ఝూహీ 210 కిలోల బరువునెత్తి స్వర్ణం సాధించింది.
కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్ లిఫ్టింగ్లో భారత్కు పతకం అందించింది మీరాభాయి చానునే. దాదాపుగా 24 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్లో అద్భుతాన్ని ఆవిష్కరించింది. మహిళల 49 కిలోల విభాగంలో భారత కీర్తి పతాకను శిఖరాగ్రాలకు చేర్చింది. ఒలింపిక్స్ ఆరంభమైన రెండో రోజే భారత పతకాల కొరతను తీర్చేసింది. చిరస్థాయిగా నిలిచే ఘనత అందుకుంది.
ఒలింపిక్స్లో రజతంతో మెరిసిన మీరాబాయి చానును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ప్రధాని.. ఆమె విజయం భారత ప్రజలందరిలో స్ఫూర్తి నింపుతుందని అన్నారు. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు గొప్ప శుభారంభం దక్కిందని కొనియాడారు.