తెరుచుకున్న నెహ్రూ జూ

లాక్‌డౌన్‌తో మూతపడ్డ నెహ్రూ జూ పార్క్‌ గేట్లు తెరుచుకున్నాయి. కరోనా కారణంగా మార్చిలో మూతపడిన జూ సుమారు ఏడు నెలల అనంతరం మంగళవారం పునః ప్రారంభమైంది. మొదటి రోజున 1,137 మంది సందర్శకులు జూను సందర్శించారు. జూ ఆవరణలో అడుగడుగునా అధికారులు వైరస్‌ నివారణ చర్యలు చేపట్టారు. లోనికి వెళ్ళే సందర్శకులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేస్తున్నారు. మాస్క్‌ ఉన్నవారినే అనుమతిస్తున్నారు. టికెట్‌ కౌంటర్లు, ప్రధాన ద్వారం వద్ద ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయిస్తున్నారు. సుమారు 40 చోట్ల శానిటైజర్‌ పాయింట్‌లను ఏర్పాటు చేశారు. మరుగుదొడ్లు, బ్యాటరీ వెహికల్‌, ట్రైన్‌లను కెమికల్స్‌తో శుభ్రం చేశారు. అనంతరం జూపార్కు 57వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది ఉత్తమ సేవలందించిన ముగ్గురు సిబ్బందికి బెస్ట్‌ సర్వీస్‌ అవార్డులను అందజేశారు. అనారోగ్యంతో ఉన్న జంతువులకు జూపార్కు ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇన్‌పేషెంట్‌ బ్లాక్‌ను, వైట్‌ టైగర్‌ కోసం నిర్మించిన ఎన్‌క్లోజర్‌ను, డెలివరీ రూమ్‌ను కూడా ప్రారంభించారు. కార్యక్రమంలో అటవీ శాఖ ఉన్నతాధికారులు ఆర్‌.శోభ, డాక్టర్‌ సిదానంద్‌ కుక్రెట్టి, బి.శ్రీనివాస్‌, శంకరన్‌, జూపార్కు క్యూరేటర్‌ ఎన్‌.క్షితిజ తదితరులు పాల్గొన్నారు.