కొనసాగనున్న ‘పాడుతా తీయగా’.. బాలు స్థానంలో చరణ్..

బాలు సుదీర్ఘ కాలంగా తన స్వర ప్రస్థానాన్ని సాగించారు.. వివిధ భాషల్లో అనేకమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఎంతోమంది సంగీత దర్శకులతో ఆయన కలిసి పనిచేశారు. ఎంతోమంది పాటల రచయితలతో ఆయనకి అనుబంధం ఉంది. సంగీత సాహిత్యాలను పెనవేసుకుపోయినట్టుగా ఆయన కనిపించేవారు. అపారమైన ఆయన అనుభవం కారణంగానే, ‘పాడుతా తీయగా’ కొన్నేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. బాలు అనుభవాన్ని అందుకోవడం మరొకరికి సాధ్యం కాదు కనుక, ఈ కార్యక్రమం ఇకపై ఉండకపోవచ్చనే టాక్ వచ్చింది.

అయితే ఈ కార్యక్రమం ఆగిపోదనే చెబుతున్నారు. బాలు స్థానంలో ఆయన తనయుడు చరణ్ హోస్ట్ గా వ్యవహరిస్తాడట. వేదికపై సంగీత సాహిత్యాలకు సంబంధించి చంద్రబోస్ – సునీత కూడా న్యాయ నిర్ణేతలుగా ఉంటారని అంటున్నారు. ఈ ముగ్గురూ కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేలా డిజైన్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. కరోనా ప్రభావం తగ్గిన తరువాత సెలక్షన్లు .. షూటింగులు ఉంటాయని అంటున్నారు. తన తండ్రి జ్ఞాపకాలను పంచుకుంటూ చరణ్ ఈ కార్యక్రమాన్ని ఆసక్తికరంగా నడిపిస్తాడనే నమ్మకం నిర్వాహకులకు ఉంది.