క్రికెట్కు వీడ్కోలు చెప్పిన పాక్ క్రికెటర్ అమిర్.. బోర్డుపై సంచలన ఆరోపణలు
పాకిస్తాన్ లెఫ్టార్మ్ పేసర్ మొహమ్మద్ ఆమిర్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుత పాక్ క్రికెట్ బోర్డు, టీమ్ మేనేజ్మెంట్ వేధింపులు భరించలేకపోతున్నానంటూ సంచలన ఆరోపణలు చేశాడు. వేధింపుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశాడు. పాక్ తరఫున 61వన్డేల్లో 81, 50 టీ20ల్లో 59 వికెట్లు పడగొట్టిన ఆమిర్… 36 టెస్టులు ఆడి 30.47 సగటుతో 119 వికెట్లు తీశాడు.
‘మానసిక వేధింపులు భరించలేకే క్రికెట్కు గుడ్ బై చెబుతున్నా. వారు చేసే అవమానాలను తట్టుకోవడం ఇక నా వల్ల కాదు. రీజన్ ఏదైనా (మ్యాచ్ ఫిక్సింగ్) క్రికెట్కు దూరంగా ఉన్నా. చేసిన తప్పుకు అనుభవించాను. కానీ ఇప్పుడు పీసీబీ పెట్టే వరుస వేధింపులను మాత్రం భరించలేకపోతున్నా’ అని ఆమిర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
కాగా ఆమిర్ రిటైర్మెంట్పై స్పందించిన పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీమ్ ఖాన్.. ఇది ఆమిర్ వ్యక్తిగత నిర్ణయమని పేర్కొన్నాడు. అతడి నిర్ణయాన్ని పీసీబీ గౌరవిస్తుందని… ఇక ఈ వ్యవహారంపై తామేమీ స్పందించమని చెప్పాడు. గతేడాది టెస్టు క్రికెట్కు ఆమిర్ గుడ్ బై చెప్పాడు. పరిమిత ఓవర్ల క్రికెట్పై ఎక్కువ ఫోకస్ పెట్టాలనే ఉద్దేశంతో రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని స్పష్టం చేశాడు. అయితే అప్పట్నుంచి అతడిని ఇంటర్నేషనల్ సిరీసులకు తీసుకోవడం లేదు. దీంతో అతడు మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది.