బండికి మరో షాకిచ్చిన పవన్‌.. సాగర్‌ బరిలో జనసేన!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి మరో షాకిచ్చారు పవన్ కళ్యాణ్‌. ఇప్పటికే కాషాయ పార్టీ తీరుపై అసహనంతో ఉన్న పవన్‌..తాజాగా సాగర్ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన కమిటీని ఎంపిక చేయడంతో పాటు ఎన్నికలు జరగనున్న నాగార్జున సాగర్‌కు కమిటీని ఎంపిక చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా సరికొప్పుల నాగేశ్వరరావును నియమించిన పవన్‌..నాగార్జున సాగర్ అధ్యక్షుడిగా దండగుల కిరణ్ కుమార్‌ను ఎంపికచేశారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది జనసేన.

ఇటీవల జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా స్వయంగా పవన్ కల్యాణ్ .బీజేపీ,బండి సంజయ్ తీరుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కషాయ నేతల మాటలతో మనసు గుచ్చుకున్న పవన్‌. అంతర్గతంగా పార్టీ నేతలతో బీజేపీ తీరును తప్పుబట్టారు. అప్పటినుండి బీజేపీ- జనసేన మధ్య గ్యాప్ రాగా ఎమ్మెల్సీ ఎన్నికలతో మరింత దూరం పెరిగింది. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆర్ఎస్ అభ్యర్థి అయిన సురభి వాణికి మద్దతు ప్రకటించి తెలంగాణ బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చారు.

ఇక తాజాగా సాగర్ ఎన్నికల కమిటీని ప్రకటించిన పవన్‌. తాము కూడా బరిలో ఉంటామనే సంకేతాన్ని బీజేపీ నేతలకు ఇచ్చారు. దీంతో సాగర్‌లో కనీసం సత్తాచాటాలని భావిస్తున్న బీజేపీకి పవన్ స్ట్రేటజీతో మైండ్ బ్లాంక్ అయింది. ఓ వైపు సాగర్ బరిలో కనీసం పోటీ ఇచ్చే అభ్యర్థి కోసం ముప్పుతిప్పలు పడుతున్న బండి బ్యాచ్‌కి పవన్ ఇచ్చిన షాక్‌తో మరింత ఢీలా పడ్డారట. మొత్తంగా ఉప ఎన్నికల వేళ జనసేనాని నిర్ణయం కమలనాథులకు భంగపాటేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.