ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం పోరాడుతున్న నాయకుడు పవన్ కళ్యాణ్

* కొవ్వూరు, పి.గన్నవరం జనసేన నేతలు, కార్యకర్తలతో పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు
వై.సీ.పీ. వికృత చేష్టలు, విధ్వంసకర పాలన కారణంగా అతలాకుతలం అవుతున్న ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం, రేపటి పౌరుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్నారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని, అవినీతి రహిత పరిపాలన ఆశించే ప్రతీ ఒక్కరూ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలపాలని కోరారు. కొవ్వూరు, పి.గన్నవరం నియోజక వర్గాల పార్టీ నేతలు, జనసేన కార్యకర్తలతో శ్రీ కొణిదెల నాగబాబు గారు బుధవారం రాజమండ్రిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన బలపరిచిన అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచిన ప్రజా ప్రతినిధులు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారని అన్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ అభ్యర్థుల అందరి విజయం కోసం కార్యకర్తలు అంతా ఐకమత్యంతో పని చేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడడమే ధ్యేయంగా పెట్టుకోవాలని పేర్కొన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక ధర్మబద్ధమైన ప్రజాహిత పరిపాలన ఎలా ఉంటుందో చేసి చూపిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన తూ.గో. జిల్లా అధ్యక్షుడు శ్రీ కందుల దుర్గేశ్, పిఏసీ సభ్యులు శ్రీ పితాని బాలకృష్ణ, పార్టీ నేతలు శ్రీ మేడా గురుదత్, శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్, శ్రీమతి గంటా స్వరూప, శ్రీమతి ప్రియా సౌజన్య, శ్రీ బత్తుల బలరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
* జనసేనలో చేరిన శ్రీమతి బెల్లపు విజయలక్ష్మి
రాజానగరం నియోజక వర్గానికి చెందిన శ్రీమతి బెల్లపు విజయలక్ష్మి పీ.ఏ.సీ. సభ్యుడు కొణిదెల నాగబాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.