ఏపీలో స్కూళ్ల రీ ఓపెన్‌ను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్

ఈ నెల 16 నుంచి పాఠశాలలను తెరిచేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరోవైపు స్కూళ్లను తెరుస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఉపాధ్యాయులకు ఇంత వరకు వ్యాక్సినేషన్ పూర్తి కాలేదని… ఇలాంటి పరిస్థితుల్లో స్కూళ్లను ఎలా తెరుస్తారని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది 85 శాతం వ్యాక్సినేషన్ ను పూర్తి చేశామని కోర్టుకు తెలిపారు. మిగిలిన టీచర్లకు కూడా త్వరితగతిన టీకాలు వేసే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. ఈ పిటిషన్ కు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. దీంతో, హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.

మరోవైపు స్కూళ్లను తెరవాలని కొందరు వాదిస్తున్నారు. రాజకీయ నాయకుల భారీ సభలు, సమావేశాలు, షాపులు, రెస్టారెంట్లు, వాహన రాకపోకలు అన్నీ జరుగుతున్నప్పుడు… స్కూళ్లకు మాత్రం అభ్యంతరం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. స్కూళ్లను తెరిస్తే విద్యార్థుల ఆరోగ్యాలకు రక్షణ ఎక్కడుంటుందని మరికొందరు వాదిస్తున్నారు.