కరోనా నుంచి కోలుకున్న తర్వాత వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేయించుకున్న పూజా హెగ్డే

సినీ నటి పూజా హెగ్డే కరోనా వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె పంచుకుంది. వ్యాక్సిన్ వేయించుకుంటున్న ఫోటోను షేర్ చేసింది. తన వయసు రెండేళ్లు ఉన్నప్పుడు తొలిసారి టీకా వేయించుకున్నానని … అప్పుడు తనతో పాటు తన తల్లి (లతా హెగ్డే) ఉందని చెప్పింది. మరో ఫొటోకు క్యాప్షన్ గా… ‘భయాన్ని చిరునవ్వుతో కప్పిపుచ్చుకున్నప్పుడు’ అని పేర్కొంది. ఈ ఏడాది పూజా హెగ్డే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే ఆమె ఐసొలేషన్ కు వెళ్లిపోయింది. కరోనాకు చికిత్స తీసుకుని ఆమె పూర్తిగా కోలుకుంది.

మరోవైపు చేతినిండా సినిమాలతో పూజా హెగ్డే చాలా బిజీగా ఉంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘రాధే శ్యామ్’లో ఆమె నటిస్తోంది. దీంతో పాటు అక్కినేని అఖిల్ సరసన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, చిరంజీవి ‘ఆచార్య’, బాలీవుడ్ మూవీ ‘సర్కస్’ చిత్రాల్లో పూజ నటిస్తోంది.