శరవేగంగా పుష్ప మూవీ షూటింగ్.. త్వరలోనే సినిమా నుంచి ఫస్ట్ సాంగ్

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ సినిమాల్లో అల్లు అర్జున్ పుష్ప ఒకటి. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు వచ్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్‌ పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక నటిస్తోంది. ప్రతినాయకుడిగా ఫాహద్‌ ఫాజిల్‌ నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో బన్నీ పూర్తిగా డీగ్లామర్‏ రోల్‏లో కనిపించబోతుండడంతో.. పుష్ప కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. నెలాఖరువరకూ హైదరాబాద్ లో షూటింగును జరిపి, వచ్చేనెలలో చివరి షెడ్యూల్ ను మారేడుమిల్లిలో జరపనున్నారు. దాంతో ఈ సినిమా ఫస్టు పార్టు పూర్తికానుంది. ఇప్పటికే విడుదల చేసిన “ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్” వీడియో ఇంటర్నెట్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి రోజుకో ఆసక్తికర అప్ డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా ఈ సినిమాను ‘క్రిస్మస్’కి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఈ సినిమా నుంచి వచ్చే నెలలో ఫస్టు సింగిల్ ను వదలాలనే ఆలోచనలో ఉన్నారనే టాక్ తాజాగా వినిపిస్తోంది. సుకుమార్ – దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా మ్యూజిక్ పరంగా మంచి మార్కులు కొట్టేశాయి. అందువలన సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.