‘ఆచార్య’ చిరంజీవికి పువ్వాడ ఆల్ ది బెస్ట్

ఆచార్య మూవీ సెట్ లో తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందడి చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య చిత్రంలో ప్రధాన పాత్రని పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ హైదరాబాద్ శివారులోని కోకాపేటలో జరుగుతోంది. అయితే ఆచార్య షూటింగ్‌ లొకేషన్‌ను తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సందర్శించారు. చిరంజీవితో పాటు దర్శకుడు కొరటాల శివను కలిసి వారితో కొద్దిసేపు మాట్లాడారు. ఈ విషయాలను మంత్రి ట్విటర్‌లో పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి సినిమా విశేషాలను దర్శకుడు వివరించారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి.. చిరంజీవికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ మేరకు మంత్రి అజయ్‌ ట్వీట్‌ చేశారు. చిరంజీవితో దిగిన ఫొటోలు పంచుకున్నారు. చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేశారు. ఆచార్య సినిమాకు సంబంధించిన టీజర్‌ విడుదలైంది. ‘పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో’ అంటూ మెగాస్టార్‌ చెప్పిన డైలాగ్స్‌తో విడుదలైన టీజర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

సినిమాలో చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రామ్‌ చరణ్‌, పూజా హెగ్డే కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్‌ పూర్తయ్యింది. మే 13వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.