చివరి ఓవర్‌లో అద్భుతం చేసి రాజస్థాన్ ని గెలిపించిన కార్తీక్ త్యాగి

రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య గత రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ అద్భుతంగా సాగింది.. రాజస్థాన్ రాయల్స్ 185 పరుగులకి ఆలౌటవగా.. అనంతరం ఛేదనలో పంజాబ్ టీమ్ 19 ఓవర్లు ముగిసే సమయానికి 182/2 నిలిచింది. అప్పటికి క్రీజులో నికోలస్ పూరన్, మర్‌క్రమ్ ఉండటంతో.. ఆ జట్టు అలవోకగా గెలిచేలా కనిపించింది. కానీ.. చివరి ఓవర్‌లో పంజాబ్ విజయానికి 6 బంతుల్లో 4 పరుగులు అవసరమైన దశలో బౌలర్‌ కార్తీక్ త్యాగికి రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ బంతిని అందించాడు. అప్పటికి మూడు ఓవర్లలో 28 పరుగులిచ్చి ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోయిన త్యాగి.. ఆఖరి ఓవర్‌లో అద్భుతం చేశాడు. కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చిన కార్తీక్ త్యాగి.. నికోలస్ పూరన్, దీపక్ హుడాలను ఔట్ చేసి రాజస్థాన్‌ని గెలిపించాడు.

ఇక టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో బరిలో దిగిన రాజస్థాన్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. ఎవిన్ లూయీస్ (36), యశస్వి జైస్వాల్ (49) పటిష్ఠమైన ఆరంభాన్నిచ్చారు. ఆ తర్వాత కెప్టెన్ సంజూ శాంసన్ (4) నిరాశపరిచినా కూడా లియామ్ లివింగ్‌స్టన్ (25)కు తోడు మహిపాల్ లోమ్రార్ (43) ఇరగదీశాడు. కేవలం 17 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసి చివరకు అర్షదీప్ బౌలింగ్‌లో మార్క్రమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మొత్తం 20 ఓవర్లు పూర్తయ్యే సరికి రాజస్థాన్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. పంజాబ్ ముందు పటిష్ఠ లక్ష్యాన్ని ఉంచింది. పంజాబ్ బౌలర్లలో యువపేసర్ అర్షదీప్ సింగ్ 5 వికెట్లతో సత్తా చాటాడు. మహమ్మద్ షమీ కూడా తన ఖాతాలో మూడు వికెట్లు వేసుకున్నాడు. ఇషాన్ పోరెల్, హర్‌ప్రీత్ బ్రార్ చెరో వికెట్ తీసుకున్నారు.