గ్రీన్ఛాలెంజ్ స్వీకరించిన రకుల్
ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన `గ్రీన్ ఇండియా` ఛాలెంజ్కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. సినీ ప్రముఖులు చాలామంది ఈ ఛాలెంజ్ స్వీకరించి, ఎంతో ప్రేమతో మొక్కలు నాటుతున్నారు. తమ ఆత్మీయులను కూడా ఇదే పని చేయాలని ప్రోత్సహిస్తున్నారు. తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ ఛాలెంజ్ను పూర్తి చేసింది. హీరో నాగచైతన్య తనకు చేసిన ఛాలెంజ్ను ఆమె స్వీకరించింది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో మొక్కలు నాటింది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. `గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒకరిద్దరి కార్యక్రమం కాదు. మనందరం కలిసి చేయాల్సిన ఉద్యమం. ప్రతి ఒక్కరు ఈ ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటాలి. ఇంత మంచి కార్యక్రమం మొదలుపెట్టి ఎంతో బాధ్యతతో ముందుకు తీసుకుపోతున్న ఎంపీ సంతోష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు` అని రకుల్ చెప్పింది. ఈ ఛాలెంజ్కు తన అభిమానులందరినీ నామినేట్ చేస్తున్నట్టు వెల్లడించింది.