రామప్ప దేవాలయానికి లభించనున్న ‘ప్రపంచ వారసత్వ హోదా’..

తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కే క్షణాలు దగ్గరపడ్డాయి. ఈ నెల 25న పారిస్‌లో జరిగే ఎంపిక కమిటీ తుది సమావేశంలో రామప్పను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించే అవకాశం ఉందని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.

రామప్పను వరల్డ్ హెరిటేజ్‌ సైట్‌గా గుర్తించాలన్న భారత్ వినతులను ఈ కమిటీ పరిశీలించిన అనంతరం ప్రకటించే అవకాశం ఉందని హైదరాబాద్‌లో నిన్న విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు.

రామప్ప ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పటికే యునెస్కోలోని భారత ప్రతినిధికి పంపినట్టు పేర్కొన్నారు. అలాగే, రామప్ప చరిత్రపై ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాన్ని, బ్రోచర్‌లను వారికి అందజేసినట్టు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.