దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయానికి అరుదైన గుర్తింపు.. ఐఎస్ఓ సర్టిఫికెట్ జారీ

దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయానికి అరుదైన గుర్తింపు లభించింది. పాలకవర్గం 30ఏళ్లుగా ఓర్పుతో చేస్తున్న సేవలు, ఆలయ నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలకు తాజాగా ఐఎస్ఓ సర్టిఫికెట్ సాధించింది. హైదరాబాద్‌లో ఐఎస్ఓ సర్టిఫికెట్ పొందిన మొదటి దేవాలయంగా రికార్డ్ సృష్టించింది దిల్‌సుఖ్‌నగర్ బాబా ఆలయం.

కోరికలు తీర్చడంలోనే కాదు.. తనను నమ్మి వచ్చే వారికి సరైన వసతులు కల్పించడం.. అన్నదాన సేవతో భక్తుల ఆకలి తీర్చడం.. నాణ్యమైన ప్రసాదాల తయారీ.. ఇలా భక్తులకు సకల సదుపాయాలు కల్పిస్తూ అందరి మన్ననలు పొందిన దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా దేవాలయం తన సేవలకు గానూ తాజాగా అంతర్జాతీయ గుర్తింపును సైతం పొందింది. గుడికి వచ్చే భక్తులకు వసతుల కల్పనతో పాటు ప్రసాదాల తయారీలో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలకు గానూ దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయానికి ఐఎస్ఓ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ ఆలయంపై భక్తుల నమ్మకానికి, సేవల్లో పాలకవర్గం ఓర్పు, నేర్పునకు ఈ సర్టిఫికెట్ నిదర్శనంగా నిలుస్తుంది. సాయినాథుడు ఉపదేశించిన శ్రద్ధా.. సబూరి.. అంటే నమ్మకం, ఓపికల గొప్పదనం మరోసారి రుజువైంది. పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాల్లో ఉన్న దేవాలయాలకు గుర్తింపు దక్కడం సహజం. అలా గతంలో చాలా ఆలయాలు గుర్తింపు పొందాయి కూడా. ఇలాంటి క్షేత్రాల సరసన దిల్‌సుఖ్ నగర్ సాయిబాబా మందిరం చోటు దక్కించుకోవడం అనేది నిజంగా అపూరమనే చెప్పాలి.

హైదారాబాద్‌లో ఎన్ని సాయిబాబా దేవాలయాలు ఉన్నా.. దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయానికి ఉన్న ప్రత్యేకతే వేరు. కారణం.. నిర్మాణంలో ఈ గుడి అచ్చం షిరిడీలోని సాయిబాబా దేవాలయాన్ని తలపిస్తూ ఉంటుంది. అందుకే ఈ మందిరాన్ని దక్షిణ షిరిడీగా పిలుస్తుంటారు భక్తులు. ఆలయం లోపల ప్రశాంత వదనంతో కనిపించే సాయిబాబా పాలరాతి విగ్రహాన్ని పాలకమండలి ఆధ్వర్యంలో 1989లో ప్రతిష్ఠించారు. ప్రస్తుతం భక్తులు దర్శించుకుంటోంది ఈ విగ్రహాన్నే. అంతకు ముందున్న పాత విగ్రహాన్ని ఆలయ ఎడమవైపు దర్శనార్థం ఉంచారు. ఇక 1991లో మొదటి అంతస్తు నిర్మించి ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేశారు. 1993లో దేవాలయ మెయిన్ ఆర్చ్‌ని నిర్మించగా.. 1994లో సాయినాథునికి స్వర్ణ కిరీటాన్ని అలంకరించారు. 1996లో ఆలయం రెండో అంతస్తు నిర్మించారు. మొదట్లో చాలా చిన్నగా ఉన్న దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయం.. రాను రాను అనేక ఆలయాల సముదాయంగా వెలసి విరాజిల్లుతోంది. భక్తుల కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయనే నమ్మకం.. ఒక్కసారి మనసారా ప్రార్థిస్తే అనుకున్నది జరుగుతుందనే ప్రచారం దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయానికి భక్తుల రాకను మరింత పెంచింది.