జగనన్న కాలనీలో మౌలిక వసతులు శూన్యం అన్న రాటాల రామయ్య
రాజంపేట: జగనన్న కాలనీలో మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య విమర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుమేరకు రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు జగనన్న ఇళ్లు, పేదలకు కన్నీళ్లు మూడవరోజులో భాగంగా సోమవారం రాజంపేట మండలం ఊటుకూరు పంచాయతీలోని సున్నపురాళ్లపల్లె గుట్ట గ్రామ వాసులకు కొండలు, గుట్టల మధ్య పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను పరిశీలించారు.ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ, పేదలకు రూ.5లక్షలతో స్వయంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆర్భాటంగా చెప్పిన సీఎం జగన్ ఎన్ని ఇళ్లు ఎన్ని జగనన్న కాలనీలు నిర్మించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జగనన్న కాలనీ కారణంగా పేదలు రాష్ట్రవ్యాప్తంగా అప్పులు పాలయ్యారని ధ్వజమెత్తారు. ఇళ్లు లేని నిరుపేదలు వైసీపీ దళారులకు ముడుపులు చెల్లించుకుని ఇటు జగనన్న ఇల్లు లేకుండా సొంత గూడుకు నోచుకోని దురవస్థలో పేదలు కొట్టుమిట్టాడుతున్నారని ఆయన విమర్శించారు. జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి పూనుకుంటే, వైసిపి వారు ఇప్పుడు హడావిడి చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్లు, డ్రైనేజీ, నీటి సౌకర్యం, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తాళ్లపాక శంకరయ్య, కొత్తూరు వీరయ్య ఆచారి, భాస్కర్ పంతులు, గోవర్ధన్, పేరూరి వెంకటయ్య, చంద్ర రెడ్డి, జనసేన వీర మహిళలు సుబ్బమ్మ, హసీనా తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-25-at-20.37.18-1024x768.jpeg)