ఏపీ రైతులకు శుభ వార్త.. రైతు భరోసా నిధుల విడుదల

కొవిడ్ కష్టకాలంలో ఆర్థిక వనరులు అనుకున్న స్థాయిలో లేకపోయినప్పటీకి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని వైఎస్ఆర్ రైతు భరోసా మొదటి విడత నిధులను విడుదల చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి ఆయన ఈ నిధులు విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”రైతు భరోసా ద్వారా అరకోటి మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. ఇప్పటి వరకు రూ.89 వేల కోట్లు ప్రజల ఖాతాలోకి నేరుగా పంపాం. గత 23 నెలల్లో రైతు భరోసా కింద రూ.17 వేల 29 కోట్లు విడుదల చేశాం. ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.1,038 కోట్లు ఇచ్చాం” అని సీఎం వివరించారు. 52.38 లక్షల మంది రైతులకు రూ.3,928 కోట్ల సాయం అందించినట్లు జగన్ తెలిపారు. రైతుభరోసా- పీఎం కిసాన్ పథకంలో భాగంగా మూడో ఏడాదికి తొలి విడత సాయమందిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దాని కంటే ఎక్కువగానే ఇస్తున్నట్లు తెలిపారు.