Sai Tej ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల

రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెగా హీరో సాయి తేజ్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు బులిటెన్‌ విడుదల చేశాయి.

సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. వెంటిలేటర్‌ అవసరం తగ్గడంతో తొలగించినట్లు చెప్పిన హాస్పిటల్ యాజమాన్యం.. శరీరంలోని ముఖ్య భాగాలన్నీ బాగానే పనిచేస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ స్పృహలోనే ఉన్నారని, తనంతట తానే సాయి తేజ్ శ్వాస తీసుకుంటున్నట్లు చెప్పిన డాక్టర్లు.. మరికొంతకాలం వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు.

బైక్‌పై ప్రయాణిస్తూ ఇసుక కారణంగా సాయి తేజ్ అదుపుతప్పి పడిపోయిన సంగతి తెలిసిందే. ప్రమాదవశాత్తూ కిందపడిపోయిన సాయి తేజ్‌ని మెడికవర్‌లో ప్రాథమిక చికిత్స అనంతరం అపోలో ఆసుపత్రికి తరలించారు.