డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పురోగతిపై సమీక్ష

హైదరాబాద్ నగరంలో పేదల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పురోగతిపై మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్, పురపాలక, గృహ నిర్మాణ శాఖ అధికారులు హాజరయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇండ్లు త్వరలోనే పూర్తవుతాయన్నారు అధికారులు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కలెక్టర్లతో కలిసి ఎంపిక చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. గతంలో అందిన వారికి మరోసారి ఇళ్లు రాకుండా చూడాలన్నారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలన్నారు. ఇండ్ల పంపిణీలో ఎలాంటి రాజకీయ ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్న చోట పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు.