రోజా, అంబటిలకు భవిష్యత్తులో ఆర్జీవి సినిమాలే గతి

  • దేశంలోనే దమ్మున్న నేత మా జనసేనాని
  • త్వరలో తిరుపతి నుంచి వారాహి యాత్ర
  • వారాహితో మా సత్తా చూపించి సీఎం కుర్చీని ఆశిస్తాం – కిరణ్ రాయల్

తిరుపతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీసుకున్న ఏ నిర్ణయానికి అయినా జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు సిద్ధంగా ఉన్నామని, రాబోయే ఎలక్షన్లలో ఆయన వెన్నంటే ఉండి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి జనసేన సత్తను చాటి సీఎం కూర్చిని ఆశిస్తామని ‘జనసేనాని వ్యూహం మా జనశ్రేణుల బాధ్యత’ అనే పోస్టర్ను విడుదల చేశారు, ఈ నినాదాన్ని రాష్ట్రవ్యాప్తంగా జనసైనికులు పాటిస్తారని జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డిలు వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా ముందు జనసేన నేతలు, రాజేష్ యాదవ్, బాబ్జి హేమకుమార్, మునస్వామి, సుమన్ బాబు, హేమంత్, ఆదికేశవులు, మోహన్ లతో కలిసి వారు మాట్లాడుతూ తమ పవన్ పై విమర్శలు చేస్తున్న మంత్రులు రోజా, అంబటి రాంబాబులకు కాలం చెల్లిందని రానున్న ఎన్నికల తరువాత వీరు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధంగా ఉండాలని విమర్శించారు. ఈ ముగ్గురు జోకర్లకు వైకాపా ఓటమితో వేరే గత్యంతరం లేదని చురకలువిసిరారు. జగన్ మెప్పు కోసం తమ పవన్ ను విమర్శించే ఈ కంత్రీ మంత్రులకు తగిన శాస్తి తప్పదన్నారు. ఈ రాక్షస పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు బిజెపి, టిడిపి, కలిసి వచ్చే ఇతర పార్టీలతో జనసేన పొత్తులతో పాలనలోకి వస్తుందని రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. జనసేనను విమర్శిస్తున్న అధికార పార్టీ నాయకులకు పవన్ కళ్యాణ్ ను చూస్తే ఎందుకంత భయమని, సింహం సింగిల్ గా వస్తున్నప్పుడు, ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకుంటే మీకు పోయేదేముందని, పవన్ కళ్యాణ్ ను విమర్శించకుంటే మీరు గుర్తింపు కోల్పోతారేమోనన్న సందేహంతో మా నాయకుడు మాట్లాడిన వెంటనే పని, పాట లేనట్లుగా విమర్శించే పని పెట్టుకున్నారని, నోటికొచ్చినట్లు మా అధినాయకుడును విమర్శిస్తే చూస్తూ ఊరుకునేదే లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.