వచ్చే బడ్జెట్‌లో దళితబంధుకు రూ.20వేలకోట్లు : సీఎం కేసీఆర్‌

వచ్చే బడ్జెట్‌లో దళితబంధు పథకానికి రూ.20వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. దళితబంధు పథకంపై జరిగిన చర్చపై సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. దళితబంధు హుజూరాబాద్‌ కోసం తెచ్చింది కాదన్నారు. 1986లోనే దళితబంధు పురుడుపోసుకున్నదని, సిద్దిపేటలో దళితచైతన్య కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. దళిత మహిళా సంఘాలు ఏర్పాటు చేశామని, ఇన్నాళ్లు విద్యుత్‌, తాగునీరు, సాగునీరుకి ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. మిషన్‌ కాకతీయతో భూర్భజలాలు పెరిగాయని, మిషన్‌ కాకతీయ పనులు చేపట్టిన ఏ చెరువుకు కూడా గండిపడలేదని స్పష్టం చేశారు.

రెండోసారి అధికారంలోకి వచ్చాక దళితబంధు చేపట్టాలని గతంలోనే అనుకున్నామని, దళితబంధు పథకం గతేడాది ప్రారంభం కావాల్సి ఉందన్నారు. కరోనా వల్ల పథకం ఏడాది ఆలస్యమైందని చెప్పారు. కరోనా వల్ల రూ.లక్ష కోట్లు నష్టం జరిగిందని, పరిస్థితుల మేరకు బడ్జెట్‌ అంచనాలు సవరించి నిధులు కేటాయించి ఆనవాయితీ అనీ, క్రమంగా 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలనే ఆలోచన మాకు ఉందని స్పష్టం చేశారు. ప్రయోగాత్మకంగా ఒక్కో నియోజకవర్గానికి వంద మందికి ఇవ్వాలని అనుకున్నామని, దళితబంధు పథకం ఇంకా ప్రారంభంలోనే ఉందని పేర్కొన్నారు.

అమలులో కనిపించే లోటుపాట్లను సవరించుకుంటూ ముందుకెళ్తామని, రాష్ట్రంలో నాలుగు మూలల నుంచి విభిన్నమైన నాలుగు మండలాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్‌ను ఇందిరాగాంధీ కాలంలో ఏర్పాటు చేశారని, ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఆర్థిక సాయం పొంది బాగుపడిన వారు కనిపించడం లేదన్నారు. నిధులతో ఫలానా పని చేయాలని ప్రభుత్వం బలవంతం పెట్టదని, మార్చిలోపు వంద నియోజకవర్గాల్లో దళితబంధు అమలు చేస్తామన్నారు. దళితబంధు నిధులు మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రమంతా ఖర్చు చేస్తే రూ.1.80లక్షల కోట్లు అవసరమవుతాయని, సందేహం లేదు మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం, దళితబంధు అమలు చేస్తామన్నారు. పథకానికి రూ.3వేలకోట్లు ఖర్చు చేస్తామన్నారు.

నియోజకవర్గానికి వంద మందిని ఎంపిక చేసే బాధ్యత ఎమ్మెల్యేదేనని చెప్పారు. వచ్చే బడ్జెట్‌లో రూ.20వేలకోట్లు ఖర్చు చేస్తామని, వచ్చే బడ్జెట్‌లో నిధులతో నియోజకవర్గానికి 2వేల మందికి దళితబంధు సాయం అందించనున్నట్లు వెల్లడించారు. రూ.10లక్షలతో ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చని, లబ్ధిదారులు బృందంగా ఏర్పడి పెద్ద పరిశ్రమ కూడా పెట్టుకోవచ్చన్నారు. దళితుల రక్షణ కోసం నిధి కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ లైసెన్స్‌ అవసరమయ్యే వ్యాపారాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఒక్క హుజూరాబాద్‌ కోసం అబద్ధాలు ఆడుతామా? అని ప్రశ్నించారు.

హైదరాబాద్‌ మినహా ప్రతి జిల్లాలో 20 శాతం మంది ఎస్సీలు ఉన్నారని, అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 26.64శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌ జిల్లాలో 17.53 ఎస్సీ జనాభా ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలన్నారు. బీసీ కుల గణన జనాభా లెక్కలు జరగాల్సిందేనన్నారు. కుల గణన కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నట్లు తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణ కోసం తీర్మానం చేసిన కేంద్రానికి పంపించామని.. ఎన్ని తీర్మానాలు పంపినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులకు సైతం రైతుబంధు ఇచ్చామని, ఎస్సీ ప్రభుత్వ ఉద్యోగికి కూడా దళితబంధు ఇస్తామని చెప్పారు.

రాష్ట్రంలోని అన్ని ఎస్సీ కుటుంబాలకు దళితబంధు ఇస్తామని.. ఓటు ఎవరికైనా వేసకోవచ్చన్నారు. దళితబంధుతో ముడిపెట్టమని, పార్టీకలతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని, ప్రతి ఎస్సీ కుటుంబానికి దళితబంధు అందించాలనేదే మా లక్ష్యమని సీఎం కేసీఆర్‌ పునరుద్ఘాటించారు.