తెలంగాణలో ప్రభుత్వ భూముల వేలానికి విశేష ప్పందన… ఖానామెట్ లో ఎకరం రూ.55 కోట్లు!

హైదరాబాదు శివార్లలోని ప్రభుత్వ భూములను హెచ్ఎండీఏ వేలం వేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న కోకాపేట పరిధిలో వేలం వేయగా అత్యధికంగా ఎకరం రూ.45 కోట్లు పలికింది. ఇవాళ ఖానామెట్ పరిధిలోని భూములను వేలం వేయగా గరిష్ఠంగా ఎకరం రూ.55 కోట్లు పలకడం విశేషం. ఖానామెట్ లోని 15 ఎకరాల భూమిలో 5 ప్లాట్లకు నేడు వేలం చేపట్టారు. ఖానామెట్ భూముల విక్రయం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి రూ.729.41 కోట్ల ఆదాయం వచ్చింది. ఖానామెట్ భూముల వేలంలో సగటున ఎకరం ధర రూ.48.92 కోట్లు పలికింది.

ఈ వేలంలో… మంజీరా కన్ స్ట్రక్షన్స్ సంస్థ రూ.160.60 కోట్లతో 2.92 ఎకరాలను, జీవీపీఆర్ లిమిటెడ్ రూ.185.98 కోట్లతో 3.69 ఎకరాలను, లింక్ వెల్ టెలీ సిస్టమ్స్ రూ.153.09 కోట్లతో 3.15 ఎకరాలను, అప్ టౌన్ లైఫ్ ప్రాజెక్ట్స్ రూ.137.34 కోట్లతో 3.15 ఎకరాలు, లింక్ వెల్ టెలీ సిస్టమ్స్ రూ.92.40 కోట్లతో మరో రెండు ఎకరాలను కొనుగోలు చేసినట్టు వెల్లడైంది.