మరో కొత్త బ్రాండ్ కు అంబాసిడర్ గా సమంత

ఏం మాయచేసావే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను తన నటనతో మాయచేసి.. తనకంటూ ఒక సొంత గుర్తింపును ఏర్పరుచుకుని, ఆ తర్వాత నిజంగానే నాగచైతన్యని తన అందంతో మాయ చేసి పెళ్లిచేసుకుని అక్కినేని వారి కోడలిగా మారిన అందాల ముద్దుగుమ్మ సమంత. సినిమాలతో పాటూ ఫాషన్ రంగంలోనూ అభిరుచి కలిగిన సమంత ను తాజాగా.. ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సైట్ మింత్ర తన బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. దక్షిణాది ప్రేక్షకులకు ఈ ఫ్యాషన్ బ్రాండ్‌కు ప్రతినిధిగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ ”ప్రముఖ బ్రాండ్ మింత్రతో కలిసి పని చేసేందుకు నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను.

ఫ్యాషన్ అనేది నా జీవితంలో ఒక భాగం కాగా, ఈ భాగస్వామ్యం నాకు మరింత ప్రత్యేకంగా అనిపించిందని’ అన్నారు. ఇకపోతే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగులు నిలిచిపోవడంతో.. ఇంటికే పరిమితమైన సమంత.. నిత్యం యోగా, ధ్యానం లాంటివి చేస్తూ అందం, ఆరోగ్యంపై బాగా శ్రద్ధ తీసుకుంటుంది. అలాగే తన ఇంటినే వ్యవసాయక్షేత్రంగా మార్చుకుని ఆకుకూరలతో పాటు కూరగాయల్ని కూడా పండిస్తుంది సామ్. అదేవిధంగా.. తన ఫ్రెండ్స్ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి, ఎడ్యుకేషనిస్ట్ ముక్తా ఖురానాతో కలిసి ‘ఏకం’ అనే ప్రీ స్కూల్‌ను జూబ్లీహిల్స్ లో ప్రారంభించింది.