నందినీ రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్!

నందినీ రెడ్డి దర్శకురాలిగా తన కెరియర్ ను మొదలుపెట్టి పదేళ్లు పూర్తయ్యాయి. ఇంతవరకూ ఆమె చేసిన సినిమాల్లో ‘అలా మొదలైంది’ .. ‘ఓ బేబీ’ సినిమాలు విజయాలను అందుకున్నాయి. ఈ పదేళ్లలో ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువ. అయితే ఇకపై ఆమె తన స్పీడ్ పెంచనున్నట్టుగా తెలుస్తోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో రెండు సినిమాలు .. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో ఒక సినిమా చేయడానికి ఆమె అంగీకరించారు.

వైజయంతీ మూవీస్ బ్యానర్లో ముందుగా ఆమె నాగచైతన్యతో ఒక సినిమా చేయవలసి ఉంది. అయితే ప్రస్తుతం చైతూ చాలా బిజీగా ఉన్నాడు. అందువలన సంతోష్ శోభన్ హీరోగా ఓ సినిమా చేయడానికి ఆమె రంగంలోకి దిగారు. ‘తను నేను’ .. ‘పేపర్ బాయ్’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ శోభన్, రీసెంట్ గా ‘ఏక్ మినీ కథ’లో నటించాడు. యూత్ లో ఈ కుర్రాడికి క్రేజ్ పెరిగింది. ఆ తరువాత సినిమాను అతను నందినీ రెడ్డి దర్శకత్వంలోనే చేయనున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.