ఏపీలో పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్దంగా ఉన్నామని వెల్లడించారు. వచ్చే ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల అంశంపై ఇప్పటికే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్నామని ఎస్ఈసీ తెలిపింది.

మార్చిలో ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు గట్టి ప్రయత్నమే చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు. కానీ కరోనా అప్పుడు జనాలను భయకంపితుల్ని చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ అభీష్టానికి వ్యతిరేకంగా ఎన్నికలను వాయిదా వేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. దీనిపై వైకాపా నాయకులు ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో.. తదనంతరం నిమ్మగడ్డకు, ప్రభుత్వానికి ఎలా యుద్ధం నడిచిందో తెలిసిందే.

కాగా ఇప్పుడు స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సన్నాహాలు చేస్తుంటే.. ప్రభుత్వం అడ్డు పడుతోంది. కానీ ఆయనేమీ తగ్గట్లేదు. వివిధ అంశాల్లో ప్రభుత్వంపై కోర్టులో స్పష్టమైన పైచేయి సాధించిన నిమ్మగడ్డ.. తాజాగా ఏపీలో స్థానిక ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నట్లు ఈ ప్రకటనలో వెల్లడించారు.

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కూడా తగ్గుముఖం పట్టిందని.. రోజుకు నమోదయ్యే కేసుల సంఖ్య 10వేల నుంచి 753కి తగ్గిందని.. ఈ నేపథ్యంలో పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన ఇబ్బందులు లేనందున వాటిని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని రమేష్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ కూడా విడుదలైన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో లేదని.. పోలింగ్‌కు నాలుగు వారాల ముందు కోడ్‌ అమల్లోకి వస్తుందని.. ఎన్నికల కోసం ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ ఎన్నికలు.. రాజ్యాంగపరమైన అవసరమే కాకుండా కేంద్ర ఆర్థిక సంఘం నిధులు తీసుకునేందుకూ దోహదపడతాయన్న ఎన్నికల కమిషనర్.. కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని.. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని రమేష్ కుమార్ స్పష్టం చేశారు.