జమ్ములో ఉగ్రవాదులకు బలైపోయిన తెలుగు రాష్ట్రాల సైనికులు

జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మాచిల్‌ సెక్టార్‌లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భగ్నం చేసే క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు.  వీరితో పాటు ఓ సైనికాధికారి, మరో బీఎస్‌ఎఫ్‌ జవాను సైతం ప్రాణాలు కోల్పోయారు. చొరబాటుకు యత్నించిన ముష్కరులను అడ్డుకునే క్రమంలో ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.

అయితే ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. ప్రాణాలు కోల్పోయిన సైనికుల్లో తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లి గ్రామానికి చెందిన జవాను ర్యాడా మహేష్‌, ఏపీలోని చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. ఐరాల మండలంలోని.. రెడ్డివారిపల్లెకు చెందిన చీకల ప్రతాప్‌రెడ్డి, సుగుణమ్మల కుమారుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి గత 18 సంవత్సరాలుగా మద్రాస్‌ రెజిమెంట్‌లో సైనికుడిగా పనిచేస్తున్నాడు. 2020, నవంబర్ 08వ తేదీ ఆదివారం జరిగిన ఎదురుకాల్పులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ప్రాణాలు విడిచాడు. ప్రవీణ్‌ హవల్దార్‌గా పని చేస్తూ కమాండో శిక్షణ తీసుకున్నాడు.

ప్రస్తుతం కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రవీణ్‌కుమార్‌కు భార్య రజిత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన భౌతికకాయం సోమవారం రాత్రి స్వగ్రామం చేరుకుంటుందని గ్రామస్థులు తెలిపారు. ఈ విషాద వార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.